జీవాత్మ అనేది లేదసలు. ఉందనుకొంటే అది కేవల మాభాసే. కారణ మేమంటే
అది కేవలం నిమిత్త కారణమే కాక ఉపాదానం కూడా. నిమిత్తం మాత్రమే
అయితే కుమ్మరి లాగా దూరమైపోయే వాడీ ప్రపంచానికి. అలాకాక
మృత్తికలాగా ఉపాదానం కూడా పరమాత్మే నన్నారు కాబట్టి ప్రపంచమంతా
వ్యాపించి ఉండాలి. అలా వ్యాపిస్తే ఇక జీవుడెక్కడున్నాడు.
శరీరాలెక్కడున్నాయి. అది కూడా ఆత్మ స్వరూపమే గదా. అలాంటప్పుడది
విశ్వాత్మ శాశ్వతం – ఇది జీవాత్మ అశాశ్వతమని తేడా ఎందుకు వచ్చింది.
తేడా వస్తుతంత్రం కాదు. మానవుడి బుద్ధి తంత్రం. అది ఉపాదానం
కూడా ననుకో లేకపోవటం వల్లనే మనకు దూరమయినట్టు
భావిస్తున్నాము. దాని ఆభాస అయిన ఈ శరీరాన్ని నమ్ముకొని ఇదే
ఆత్మ మిగతాదంతా అనాత్మ అని హద్దు లేర్పరుచుకొని కష్ట సుఖాలన్నీ
మన కాపాదించుకొని జనన మరణాది అనర్థాలన్నీ అనుభవిస్తున్నాము.
ఇదీ జరిగిన ప్రమాదం.
అంచేత మన బుద్ధుల ననుసరించి చెప్పవలసి వచ్చింది శాస్త్రం అది విశ్వాత్మ అని విశ్వం కన్నా పరమమైనదని దాని మీద ఈ విశ్వమంతా ఆధారపడి బ్రతుకుతున్నదనీ. అంతేగాక అది శాశ్వతమూ శివమూ అచ్యుతమైతే ఈ పిండ శరీరమే నా స్వరూపమే నని అభిమానించే వీడొక జీవుడని - వీడు మాత్రం అశాశ్వతుడూ చ్యుతుడూ అశివుడూ నని.
Page 133