#

About Us

శ్రీ గురుభ్యో నమః


బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి జీవిత విశేషాలు
అద్వైత వేదాంతమే ధ్యేయంగా జీవించిన పరమ పూజ్యులు, ప్రాతః స్మరణీయులు బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు.


జననం మరియు విద్యాభ్యాసం
వీరు శ్రీమతి సీతమ్మ, శ్రీ సుందరరావు దంపతులకు 1927వ సంవత్సరం జూన్ 15వ తేదీ (ప్రభవ జ్యేష్ట శుద్ధ పూర్ణిమ బుధవారము) ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసము ఓంగోలు, గుంటూరు, వాల్తేరులలో జరిగింది. 1948లో ఆంధ్ర విశ్వవిద్యాలయము నందు M.A పట్టభద్రులైనారు.


వృత్తి మరియు ప్రవచన యాత్ర
అనంతపురం నుండి శ్రీకాకుళము వరకు ఎన్నో ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూనే సాహిత్య-అద్వైత వేదాంతోపన్యాసనలు కొనసాగిస్తూ 1982లో కడపలో పదవీ విరమణ గావించిరి.


అద్వైత జ్ఞాన భోధ
వేదాంత విద్యా ధురీణి బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు శంకర భాష్యం యొక్క లోతుపాతులను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించడంలో వారు సిద్ధహస్తులు. పదవీ విరమణ తర్వాత కాలము నుండి గురువు గారు హైదరాబాదులో నివసిస్తూ దశోపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యం, భగవద్గీత వంటి ప్రస్థానత్రయ గ్రంథాలను అనేక ప్రకరణ గ్రంధాలను వారు తమ శిష్యులకు బోధించారు. 2001 వ సంవత్సరమున గురువు గారు విజయవాడకు తమ నివాసమును మార్చుకున్నారు. విజయవాడలో మరలా ప్రస్థానత్రయ గ్రంథాలను, మానసోల్లాసము, వేదాంత పంచదశి, త్రిపురా రహస్యము, శ్రీ లలితా సహస్రనామాలు, శ్రీ విష్ణు సహస్రనామాలు , అనేక ప్రకరణ గ్రంధాలను అద్వైత పరంగా సమన్వయం చేస్తూ బోధించిన తీరు అద్వితీయం.


విదేహముక్తి
60 సంవత్సరములుగా అద్వైత విజ్ఞానాన్ని అందిస్తూ, 19 డిసెంబర్ 2015 వ సంవత్సరమున గురువు గారు విదేహముక్తులైనారు. తమ శిష్యులకు ప్రవచనముల ద్వార మరియు గ్రంధ రచనల ద్వార మోక్ష మార్గాన్ని అందించిన మహనీయులు, పూజ్యనీయులే.


మా ఈ ప్రయత్నం
గురువు గారు తమ జీవిత కాలంలో ప్రచారం కావాలని ఏ నాడు ప్రయత్నించలేదు. అద్వైత విచారణే జీవిత లక్ష్యంగా ప్రచారానికి దూరంగా జీవిస్తూ వారు సాధించిన అద్వైత విజ్ఞానాన్ని లోకానికి అందించాలని నిరంతరము కృషి చేసిన మహాజ్ఞాని. వారి జ్ఞాన యజ్ఞంలో భాగమైన ఈ ప్రవచనాలను ఆత్మ విచారణ మరియు మోక్ష మార్గాన్ని ఆసక్తి ఉన్న సాధకులకు ఈ Website ద్వారా అందించడమే మా వినమ్ర ప్రయత్నం.



img