#


Back

ప్రస్థానత్రయ సారం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

4. ప్రశ్నోపనిషత్తు

ఇది వినటాని కెంత రమణీయంగా ఉన్నా ఇందులో ఏదైనా ఉపపత్తి చూపితే కాని నమ్మకం పుట్టదు సాధకుడికి. ఉపపత్తి అంటే హేతువు Reason. హేతువే కాక దృష్టాంతం కూడా చూపాలి మనకు శాస్త్రం. ఆ బాధ్యత వహిస్తుంది ప్రశ్నోపనిషత్తు. ఆరు ప్రశ్నలు వేశారు ఆరుగురు మహర్షులు పిప్పలాదుడనే బ్రహ్మర్షిని. అందులో మూడు ప్రాణానికీ మూడు మనస్సుకూ సంబంధించినవి. మనస్సులోనే ఙ్ఞానమనేది ఉదయిస్తుంది. అదే అనుభవానికి కూడా నిలయం. మనసు ఙ్ఞానశక్తి అయితే ప్రాణం క్రియాశక్తి. సాధన అంతా క్రియే. కాబట్టి మొదట ప్రాణ విషయం నడచింది. తరువాత ఈ క్రియ ద్వారా మనసులో ఏర్పడవలసిన ఆ ఙ్ఞానమేదో బోధిస్తుందుపనిషత్తు.

ఎలాగాంటే జనన మరణాదులైన భావాలన్నీ నామరూపాల సంపర్కం వల్లనే కలుగుతున్నాయి. ఈ నామరూపాలనే కళలని పేర్కొన్నది. ఇది ప్రాణం మొదలుకొని నామం దాకా పదహారు. షోడశ కళలని పేరు వీటికి. కళ అంటే ఒక శకలం, ఖండం, అఖండమైన ఆత్మ చైతన్యమే 16 కళలుగా కనిపిస్తున్నది మనకు. వీటితో కలిపి పట్టుకుంటే అది సకలం. అప్పుడు సంసారమే గాని సాయుజ్యానికి నోచుకోలేడు జీవుడు. ఎందుకంటే వీడి బుద్ధీ సకలమే. వీడు చూచే ప్రపంచమూ సకలమే. అంచేత ఈ సకలాన్నే మరలా నిష్కలంగా చూడాలి మనం. అంటే ఎక్కడి నుంచి ఈ కళలు జన్మించాయో అక్కడే వీటిని లయం చేసి చూడాలి. చూస్తే అప్పుడీ ప్రపంచమే పరమాత్మగా మారి దర్శనమిస్తుంది. నదులన్నీ మరలా సముద్రంలో కలిసి సముద్రమనే ఒకే ఒక రూపంగా మారినట్టు ప్రాణేంద్రియాది విశేషాలన్నీ నిర్విశేషమైన ఆత్మ చైతన్యంగా అనుభవానికి రాగలవు. అలాంటప్పుడిక జనన మరణాది చింత ఏముంది. అవీ కళలే కాబట్టి చైతన్యరూపంగా నిష్కళమై అనుభవానికి వస్తాయని ప్రశ్నోపనిషత్తు పరిష్కారం.