#


Back

ప్రస్థానత్రయ సారం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు

1. ఈశావాశ్యోపనిషత్తు

8. ఐతరేయోపనిషత్తు

తైత్తరీయం లాగే ఐతరేయం కూడా జీవుడి రాకపోకలే వర్ణిస్తుంది. కాని తేడా ఏమంటే జీవుడి ఙ్ఞానం బుద్ధిలో ప్రవేశిస్తే ప్రాణం పాద తలం నుంచి లోపలికి వచ్చిందట. తన్మూలంగానే వీడు తన సర్వఙ్ఞతను పోగొట్టుకొని ఇంద్రియాల ద్వారా విశేష ఙ్ఞాన మార్జిస్తూ దానితోనే తృప్తి పడుతుంటాడు. అంతే కాదు. జాగ్రత్తు స్వప్నం సుషుప్తి అనే మూడు దశలు కూడా వాటి వల్లనే అనుభవిస్తుంటాడు. ఈ విశేషానుభవమే సంసార బంధం వీడికి.

మరలా వీడీ బంధం నుంచి బయటపడాలంటే సుషుప్తి అనే మూడవ అవస్థను కూడా దాటిపోవాలి. సుషుప్తి అంటే అఙ్ఞానం. విశేష ఙ్ఞానమే ఇక్కడ అఙ్ఞానమంటే. అది జాగ్రత్స్వప్నాలలో వృత్తి రూపంగా పని చేస్తుంది. సుషుప్తిలో వాసనగా Impression మారుతుంది. వాసనలను భేదించాలంటే విశేష ఙ్ఞానంగాక సామాన్యమైన ఆత్మ ఙ్ఞానం సంపాదించాలి. తన స్వరూపమే తాను చూచే ఈ ప్రపంచమంతా పరుచుకొని ఉన్నట్టు దర్శించాలి. అప్పుడది విఙ్ఞానం కాదు. ప్రఙ్ఞానమవుతుంది. నీవూ, నీవు చూచే చరా చర ప్రపంచమంతా ప్రఙ్ఞానంలోనే ఉంది. అంతా ప్రఙ్ఞాన స్వరూపమే ననే రహస్యమప్పుడు అనుభవానికి రాగలదు. అదే జీవ బ్రహ్మైక్యం. అదే మోక్షం. ఐతరేయ సారమిదే.