ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
9. రాజవిద్యా రాజగుహ్య యోగం
ధ్యానమూ జ్ఞానమూ ఈ రెండింటిలో ధ్యానం క్రమముక్తికీ, జ్ఞానం సద్యోముక్తికీ తోడు పడతాయి. ఇందులో ధ్యానమయింది. ఇక జ్ఞాన మెలాంటిదో వివరిస్తున్నదీ అధ్యాయం. రెండూ ఒకటే అనిపిస్తుంది. కాని తేడా ఉంది. ధ్యానం ఏవొక్క మూర్తినో పట్టుకొని చేసేది. పైగా మిగతా మానసిక భావాలను లయం చేసుకొనే విధానం లేదందులో. మహా అయితే మనసుకు రాకుండా త్రోసివేస్తాము. జ్ఞానమలా కాదు. సర్వమూ బ్రహ్మమని చూచే చూపు. అందులో అన్యమైన భావాలన్నీ కలుపుకొంటూ పోవాలి మనం. అప్పుడే ఆత్మ అనాత్మ అనే తేడా పోయి అంతా ఏకమనే ఆత్మభావం సిద్ధిస్తుంది. ఇదే విద్య. ఇదే గుహ్యం. విద్య అంటే జ్ఞానం. గుహ్యమంటే రహస్యం. అంతా తానే అయితే ఎవరున్నారిక చెప్పటానికి. అందుకే రహస్యమయింది. అనుభవమెప్పుడూ రహస్యమే. అందులో ఇది రాజరహస్యం. ఎక్కడో లేదా బ్రహ్మం. ప్రత్యక్షావగమం. ఎక్కడ చూస్తే అక్కడే. ఉండటమనే స్ఫురణే గదా అది. ఎక్కడ లేదు. ప్రతి పదార్ధమూ ఉందనే గదా స్ఫురిస్తుంటుంది. ఆ స్ఫురణే ఆత్మ. నీవు స్ఫురించే పదార్ధాన్ని చూస్తున్నావు. అది సవికల్ప దృష్టి. అలా కాక వాటి స్ఫురణ చూడు. అది నిర్వికల్పం. సుసుఖం కర్తుం. అలా చూడటం కూడా కష్టం కాదు చాలా సులభమంటున్నది గీత. సొమ్ములు చూచినట్టు వాటిలో బంగారం మాత్రం చూడలేవా. అది కష్టమా. అలాగే ఇదీ. అసలు రహస్యమేమంటే ఆ స్ఫురణే అంతటా వ్యాపించి ఉంది. అందులోనే ఈ సమస్త భూతాలు చేరిపోతాయి. కాని వీటిలో అది ఉందన గూడదు. అదే వీటిలో. ఆ మాటకు వస్తే వీటిలో కూడా అది లేదు. అంటే ఉన్నదదే మరేదీ కాదని భావం. అయినా ఇవి కనిపిస్తున్నాయంటే అదే ఇన్ని రూపాలలోదర్శనమిస్తున్నది. అందులో నుంచే జన్మించి అందులోనే లయమవుతుంటాయి. దాని శక్తి అలాంటిది. ఆ శక్తి ప్రభావంతో నేనొక రూపం ధరించి అవతరిస్తుంటే నేనా అవతారమేనని అక్కడికే చూచి నన్నవమానిస్తారు మూఢులంటాడు పరమాత్మ. ఎవరో ఉంటారు మహాత్ములు. వారు జ్ఞానయజ్ఞంతో నన్ను యజనం చేస్తుంటారు. అనన్యభావంతో పట్టుకొంటారు నన్ను. వారికే రూపం చూచినా, ఏ క్రియ చూచినా అందులో అవి కనపడవు. ఆత్మే స్ఫురిస్తుంటుంది. ఆత్మ సర్వత్ర సమంగా వ్యాపించి ఉంది. అలాంటి భావనతో బ్రతికితే చాలు. చివరకు సర్వాత్మ భావాన్నే అందుకొని తరిస్తారు.