ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
8. అక్షర పరబ్రహ్మ యోగం
అక్షరమటే నశించనిది. అది మాయాశక్తి అయితే దాని కన్నా పరమైన అక్షరం పరమాత్మ. ఈ అక్షరం ఆ అక్షరాన్ని చూపటనికే ఉంది. ఇది ఓంకార రూపంగా భావించారు పెద్దలు. ఓంకారమంటే అ-ఉ-మ అనే మూడు అక్షరాల సంపుటి. మూడూ మూడు ప్రపంచాలకు, మూడూ శరీరాలకు, ముగ్గురు జీవులకు సంకేతం. ఓంకారనికే ప్రణవమని కూడ పేరు. దాన్ని ఉచ్చరించేటప్పుడు దానికి వాచ్యమైన ఈ అర్ధాన్ని మనసుకు తెచ్చుకోవాలి. వాచకమైన శబ్దమెక్కడ ఆగిపోతుందో అక్కడ ఈ జీవ జగద్భావాలు కూడా లయమయిపోతాయి. వాచకంతో పాటు వాచ్యం కూడా లయమవుతున్నప్పుడవి రెండూ ఎందులో లయమవుతున్నాయో గమనించాలి సాధకుడు. అది ఏదో గాదు. సర్వ భూతాలకు అదే స్వరూపం. అక్ష్రారాత్పరతః పరః - అక్షరానికి పరమైన అక్షరమది. దాన్ని తదాకారమైన అలోచనతో పట్టుకోగలిగితే అది జ్ఞానం. అలా గాక దీని ద్వారా దాన్ని ఏకాగ్రతతో భావన చేస్తూ అవసానంలో ప్రాణశక్తిని భ్రూమధ్యంలో చేర్చి అక్కడ నుంచి కపాలం దాకా తీసుకుపోయి సుషుమ్న ద్వారా బయటికి వచ్చి దాన్ని సూర్యనాడిలో ప్రవేశ పెట్టి పాణోత్ర్కమణ చెందితే సత్యలోకం దాకా వెళ్ళి అక్కడ ఈ జీవుడు నిర్గుణ జ్ఞానంతో తరిస్తాడు. ఇది ధ్యాన మార్గం.