ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
6. ఆత్మ సంయమ యోగం
అయితే ఇలాంటి సర్వాత్మ భావం మానవుడికి సిద్ధించాలంటే దానికెంతో సాధన కావాలి. మానవుడు తన్ను తానే ఉద్ధరించుకోవాలి. ఆత్మ జ్ఞానం కలిగే వరకూ మనస్సును వశంలో ఉంచుకోవాలి. వీడు తన - వీడు పరాయి అనే భేద దృష్టి పనికిరాదు. సమదృష్టి నలవరుచుకోవాలి. అలవరుచుకోవాలంటే యమ నియమాదులు కొంత కాల మవలంబించాలి. యుక్తాహార విహారాదులు పాటించాలి. శరీరం స్వాధీనమైతే మనస్సూ క్రమంగా స్వాధీనమవుతుంది. మనస్సు అన్నింటికన్నా ప్రధానమైన సాధనం. దాన్ని తొందరపడకుందా నెమ్మదిగా ఆత్మ చైతన్యంగా మార్చుకోవాలి. అది ఆత్మగా మారి నిశ్చలమైతే చాలు. అదే సర్వవ్యాపకమైన బ్రహ్మం. అప్పుడన్ని పదార్ధాలలో తన ఆత్మే. ఆత్మలోనే సమస్త పదార్ధాలూ దర్శనమిస్తాయి. అయితే మనసనేది చంచలం కదా. అది మనకు స్వాధీనమయ్యే దెప్పుడు. ఆత్మగా మారేదెప్పుడది. బేజారు పడరాదు. అభ్యాస మొకటి - వైరాగ్య మొకటి. ఇవి రెండే సాధనాలు దాన్ని వశపరుచుకోటానికి. మరి యావజ్జీవమూ అలాటి ప్రయత్నం చేస్తూ పొతే అది జీవించి ఉండగా ఫలిత మిస్తుందో లేదో. ఇవ్వకపోతే ఏమిటి మన గతి అని కూడా బెంబేలు పడరాదు. సర్వాత్మ భావం సిద్ధించే వరకూ అభ్యాసం సాగుతూ పోవాలి. ఈ జన్మలో అది ఫలించక పోతే మరొక జన్మలో. ఆ జన్మలో కాకుంటే మరో జన్మలో తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే చేసింది వృధా పోదు. జన్మలనేవి అభ్యాసం కోసమే ఉన్నాయి. ప్రతి జన్మలో కొంత కొంత ప్రయత్నిస్తూ పోతే ఆ సంస్కారం తరువాత జన్మకు కలిసి వస్తుంది. అది ఏ జన్మకో ఒక జన్మకు పరిపాకానికి వచ్చి సర్వాత్మ దర్శనం తప్పకుండా లభిస్తుంది. భగవానుడిచ్చే హామీ ఇది. ఇదీ ఆత్మ సంయమం మనకు చెప్పే మాట.