ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
4. జ్ఞాన యోగం
ఇలా ఈశ్వర భావన చేస్తూ దాని వెలుగులోనే జీవయాత్ర సాగిస్తూ పోతే కర్మ జ్ఞానంగా మారుతుంది. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ రెండూ ఏకమవుతాయి. రెంటికీ భేదం లేదు. ఒకటి దృష్టి మరొకటి దాని ప్రసరణ. సముద్ర జలమూ దాని చలనమూ ఒకటి గాదా. అలాగే ఇదీ. అప్పుడు కర్త అయినా కర్త కాడు మానవుడు. జ్ఞానమనే అగ్ని కామకర్మలు రెంటిని కాల్చి వేస్తుంది. అప్పుడు ఒక కర్మ చేస్తున్నా చేయనివాడే. అయితే ఈ నిబ్బరం మన కలవడాలంటే ఎక్కువ పనులు పెట్టుకోరాదు. శరీరం నిలవటానికి కెంతో అంతే పెట్టుకోవాలి. లేకుంటే పనుల భారం మనలను కుంగదీస్తుంది. ఈశ్వర జ్ఞాన మలవడదు. అంతా ఈశ్వరుడనే జ్ఞానం మనసులో గట్టి పడితే వాడు గత సంగుడే ముక్తుడే. అలాటి వాడే పని చేసినా సమగ్రం ప్రవిలీయతే. ఆ కర్మ ఫలంతో సహా సమసి పోతుంది. వాణ్ణి బంధించదు. వాడి జీవితమే ఒక మహా యజ్ఞం. జ్ఞాన యజ్ఞమది. భౌతికం గాదు. అందులో ప్రతి ఒక్క ఆలోచనా క్రియా బ్రహ్మ స్వరూపమే. జ్ఞానే పరిసమాప్యతే - ప్రతిదీ సమష్టి చైతన్యంగానే దర్శనమిస్తూ పోతుంది. ఇలాంటి జ్ఞాన మలవడాలంటే మాటలు గాదు. గురూపదేశ ముండాలి మొదట. గురువులంటే జ్ఞానులూ తత్వదర్శనులూ. వారిని శ్రధ్దా భక్తులతో సేవిస్తే జ్ఞానోపదేశం చేస్తారు. తన్మూలంగా సమస్త భూతాలలో ఆత్మనే దర్శిస్తూ పోయే సామర్ధ్య మేర్పడుతుంది. అవిద్యా కామాది కాలుష్య మెంత ఉన్నా అది జ్ఞానంలొ ప్రక్షాళన మయిపోతుంది. కాని ఇలాంటి జ్ఞానయోగం కర్మ యోగం వల్లనే కలుగుతుంది. దానికి కొంత కాలం పడుతుంది. అది మన శ్రద్ధను బట్టి తత్పరత్వాన్ని బట్టి ఉంటుంది. అది ఒక శిక్షణ. దానివల్ల సంపాదించే ఉద్యోగం లాంటిది జ్ఞానం. జ్ఞానమే లభించిందో పరాం శాంతిం పరమమైన శాంతి చేకూరుతుంది. దానికిక ఆలస్యం లేదు. అయితే అజ్ఞుడికి అశ్రధ్దాళువుకూ, సంశయ స్వభావుడికీ అబ్బేది కాదా భాగ్యం. కర్మయోగంతోనూ జ్ఞనాభ్యాసంతోనూ వాటిని పోగొట్టుకొన్న వాడికే జీవితంలో శాంతి సౌఖ్యం.