ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
18. మోక్షసన్యాస యోగం
ఇంతకూ మోక్షమనే ఫలాన్ని రుచి చూడాలంటే దానికి సన్న్యాసమనేది ఆవశ్యకం. సన్న్యాసమంటే వదలుకోవటం. కాషాయ కమండలు ధారణ కాదు. మనస్సన్న్యాసమే చెబుతుంది గీత బాహ్యసన్న్యాసం కాదు. అంచేత వదలుకోవలసింది కర్మ కాదు. ప్రతి కర్మ నేను చేస్తున్నాననే కర్తృత్వమూ - ఇది నాకు తప్పకుండా ఫలితమివ్వాలనే భోక్తృత్వమూ వీటిని వదలు కోవలసింది. వీటికి అహం మమలని పేరు. ఇవే సంసారమంటే. కాని అదైనా వదలుకోవటం సాధ్యమా. సాధ్యమే. సర్వభూతేషు యేనైకం భావం. మనం లావాదేవీ పెట్టుకొన్న ప్రతి విషయంలోనూ అవిభక్తంగా వ్యాపించి ఒకటుంది. అదేదో గాదు. ప్రతిదీ ఉంది ఉందనే స్ఫురణ . ఇలాంటి జ్ఞానం మనసులో ఎప్పుడూ ఏమరకుండా ఉంటే చాలు. మనసా వాచా కాయేన - నీవే పని చేసినా పరవాలేదు. అసలు నీ స్వధర్మం నీవు మానుకోనక్కరలేదు. ఏది చేసినా ఒకనొక సమష్టి చైతన్యం వెలుగులోనే ఇది నడుస్తూ ఉంది. నేను కేవలం దానికొక ప్రణాళిక Medium మాత్రమే నని భావిస్తూ పోతే చాలు. అది నీ బుద్ధిని శుధ్ధి చేస్తుంది. ఏకాగ్రత కల్పిస్తుంది. ఇదే జ్ఞాన మార్గం. ఇది కాక మంత్ర తంత్ర యోగాభ్యాసాదులేవి పెట్టుకొన్నా అవి కేవలం ప్రయాసే. ఫలితమివ్వవు. దీనికే అనన్యభక్తి - అనన్య ధ్యానమని కూడా పేరు. ఒక దివ్య శక్తే నాలోనూ, నేను చూచే సమస్త భూతాలలోనూ చేరి అన్నింటినీ నడిపిస్తున్నదనే జ్ఞానం కన్నా గొప్ప భావన ఏముంది. - అదే జీవితంలో శాంతి - జీవితానంతరం మోక్షాన్నీ ప్రసాదిస్తుంది.
ఇంతకూ ఒక్క మాట చివరిసారిగా తెగేసి చెబుతున్నది గీత.సర్వధర్మాన్ పరిత్యజ్య - మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో - మోక్షయిష్యామి మాశుచః
సచ్చిద్రూపమైన ఆత్మే సర్వ వ్యాపకం. సర్వ స్వరూపం. దాని విశేషాలే నామ రూపాలు. అవి ఏవో గావు దానిధర్మాలే అంటే లక్షణాలే. వాటిని గాదు మనం చూడవలసింది. అవి దేని లక్షణాలో ఆ మూలతత్త్వాన్ని పట్టుకోవాలి. పట్టుకొని అదే గదా ఇవి అని వీటిని దానిలో ఎప్పటికప్పుడు లయం చేసుకోవాలి. అంటే వీటిని ఆ రూపంగా చూస్తూ పోవాలి. బంగారమంటే ఏమిటో గుర్తించి అదే గదా ఈ కంటెలు, కాసుల దండలనే సొమ్ములన్నీ అని ఆ రూపంగానే వీటిని చూచినట్టు చూడాలి. అప్పుడా నేననే జ్ఞానం అఖండగా దర్శనమిస్తుంది. అది కేవల జ్ఞాన స్వరూపం కాబట్టి అవిద్యా కామ కర్మలనే త్రివిధ పాపాలనుంచీ మానవుడికి ముక్తి లభిస్తుంది. సంసారంలో పడగొట్టేదేదో అది పాపం. పాతకం. పరిపూర్ణ జ్ఞానం లభిస్తే ఇక అజ్ఞానమే లేదు కాబట్టి దానితోపాటు కామకర్మలనే పాపాలు కూడా ఎగిరిపోక తప్పదు. పోతే ఇక సంసార బంధమనే సమస్య ఏముంది.
చివరి మాట
ఇలాగా జీవిత సమస్యను అవలీలగా పరిష్కరిస్తుంది గీత. అయితే అది కేవలం వస్తుసిద్ధమనే మాట మరచిపోరాదు మానవుడు. వస్తువెప్పుడూ పరోక్షం మనకు. అది మనకు బుద్ధి సిద్ధమైతేనే అనుభవం. విమృశ్యైత దశేషేణ దాన్ని బాగా నీ మనస్సులో విమర్శించి పరోక్షంగా శ్రవణం చేసిన సత్యాన్ని అపరోక్షంగా Direct అనుభవానికి తెచ్చుకో. అప్పుడే నీ సమస్యకు పరిష్కార మంటున్నది గీత. సమస్య బాహ్య ప్రపంచం వల్ల ఏర్పడినా అది నీ మనస్సుకు వచ్చినప్పుడే గదా నాకు సమస్య అనే అనుభవం నీకు కలుగుతున్నది. అలాగే పరిష్కారం కూడా బాహ్యంగా కేవలం వింటే కాదు. అది కూడా మనసుకు తెచ్చుకొని పదే పదే భావన చేయాలి. ఆ భావనే మన కనుభవమిస్తుంది. ఇప్పుడీ లోకానుభవం కూడా శారీరకం కాదు. మానసికమే బాగా ఆలోచిస్తే. లోకానుభవమే మానసికమయినప్పుడు, మోక్షానుభవం భౌతికమెలా అవుతుంది. అనుభవమన్నప్పుడది బంధమైనా మానసికమే. మోక్షమైనా మానసికమే. అయితే బంధం సవికల్పమైన మనస్సు అనుభవిస్తే, మోక్షం నిర్వికల్పమైన మనస్సనుభ విస్తుంది. నిర్వికల్పమైన ఆత్మ స్వరూపాన్ని దర్శించి నప్పుడు మనస్సు నిర్వికల్పమే కావలసి ఉంది. అలాగే అయిందో ఇక అది మనస్సే గాదు - ఆత్మ స్వరూపమే. అంతా ఆత్మేననే దృష్టి ఏర్పడినప్పుడిక అనాత్మ ప్రపంచమే లేదు. అలాటి సర్వాత్మ భావాన్నే మన కుపదేశిస్తున్నది భగవద్గీత. అలాగే జీవించమని కూడా బోధిస్తున్నది. ఇంతకన్నా గొప్ప బోధ ఏమున్నది. గీతా సారమిదే. ఉపనిషత్తుల దగ్గరి నుంచీ, బ్రహ్మసూత్రాల దగ్గరి నుంచీ, భగవదద్గీత వరకు శ్రవణ మనన నిదిధ్యాసనా రూపంగా ప్రస్థానత్రయం మనకు చేస్తూ వచ్చిన జీవిత సందేశ సారమిదే.
ఓం శాంతిః శాంతిః శాంతిః
***