ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
17. శ్రద్ధాత్రయయోగం
దేనికైనా శ్రద్ధ అనేది ఉండాలి మానవుడికి. శ్రద్ధామయోయం పురుషః యోయచ్ఛ్రర్ధః సః - శ్రద్ధే మానవుడంటే. ఎముకలు కండలు రక్తం మాసం కాదు. లక్ష్యం మీద దృష్టికి శ్రద్ధ అని పేరు. అది ఉంటే దానికి తగిన ఆలోచనా - ప్రవర్తనా తప్పకుండా ఏర్పడతాయి. అది ఎప్పటికైనా జీవిత గమ్యాన్ని చేరుస్తుంది. సందేహం లేదు. మూడు విధాలీ శ్రద్ధ అనేది. సత్త్వాది గుణాలను బట్టే ఏర్పడుతాయవి. సత్త్వం వల్ల సాత్త్విక శ్రద్ధ. రజస్సు వల్ల రాజస శ్రద్ధ. పోతే తమస్సు వల్ల తామస శ్రద్ధ. అవి మరలా వారు తీసుకొనే ఆహారాన్ని బట్టి ఏర్పడుతాయి. అన్నింటిలోనూ సాత్త్వికమైన శ్రద్ధ ఉన్నవాడు సాత్త్వికమైన ఆహారమే సేవిస్తాడు. ఆయుస్సూ, బలమూ, ఆరోగ్యమూ పంచే రసవంతమైన హృద్యమైన ఆహారమే వాడికిష్టం కట్వామ్ల లవణాదులు కావు. అవి రాజసుల కిష్టం - పోతే పాసిపోయిన చెడిపోయిన అన్నపానాలు తామసులకు ప్రీతికరం. ఇక యజ్ఞమూ, తపస్సూ, దానమూ మొదలైనవి కూడా ఎన్నో ఉన్నాయి వారి వారి శ్రద్ధను బట్టి ప్రవర్తించేవి. ఫల నిరపేక్షంగా కేవలం తనకు కర్తవ్యమని చేసేదే సాత్వికమైన యజ్ఞం. వేద, గురు, పూజా, శౌచమూ, బ్రహ్మచర్యమూ, శారీరకమైన తపస్సు, సత్యమూ, ప్రియమూ, హితమైన వాక్కు, వాజ్ఞయ తపస్సు, మనశుద్ధి, మౌనం, సౌమ్యత్వం, ఇంద్రియ నిగ్రహం, మానసమైన తపస్సు, ఇదంతా సాత్వికమే. దేశ కాల పాత్రల యోగ్యతను గమనించి చేసేది సాత్వికమైన దానం. ఇలా సత్వగుణానుగుణంగా సాగినప్పుడే అది జీవితానికి అన్ని రంగాలలో జయాన్ని చేకూరుస్తుంది. తుదకు ఓం తత్సత్ అని ఏది చేసినా ఆ బ్రహ్మ చింతనే మానవుడి శ్రద్ధా భక్తుల కనుగుణమైన మోక్ష ఫలాన్ని ప్రసాదిస్తుందని గీత ఇచ్చే హామీ.