ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
16. దైవాసుర సంపద్విభాగయోగం
అలా దర్శించటాని కధికార సంపత్తి ఉండాలి మానవుడికి. లోకంలో మానవులందరూ రెండు జాతులు. కొందరు దైవ గుణాలు గలవారు. మరికొంద రసుర గుణాలున్నవారు. దైవ సంపన్నులు చాలా వరకు సాత్విక స్వభావులయి ఉంటారు. అసుర గుణసంపన్నులు రాజస తామస స్వభావులు. ఇందులో దైవ సంపద అనేది మానవుణ్ణి బంధం నుంచి తప్పిస్తుంది. అసుర సంపద అంతకంతకు సంసార బంధంలో పడదోస్తుంది. అసుర సంపద అంటే రజస్తమో గుణాల విజృంభణమే. అలాటి వారికి అహంకార బల దర్పాది అవలక్షణాలెన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. దానితో కన్నుగానక బ్రతుకుతుంటారు వారు. చివరకు వారికి ప్రాప్తించేది నరకమే. త్రివిధం నరకస్యేదం ద్వారం - కామం క్రోధం లోభమనేవి మూడూ మూడు ప్రకృతి గుణాలకు ప్రతీకలు. వాటి వలలో బడితే చాలు. అవి సరాసరి నరకానికే చేరుస్తాయి. ఆ తరువాత అసుర యోనులలో జన్మిస్తారలాటి వారు. ఏ జన్మకూ భగవత్ప్రాప్తి లేదు వారికి. పునరపి జనన మన్నట్లు జనన మరణ పరంపర అనుభవిస్తూనే పోతారు. మరి దైవ గుణ సంపన్నులయితే శాస్త్రోక్తమైన మార్గంలో జీవితం సాగిస్తూ చివరకు భగవత్స్వరూప చింతనతో జన్మ రాహిత్యం చేసుకొని క్రమంగా ముక్తులయి పోగలరు. శాస్త్రాన్ని వదిలేసి తమ ఇష్టానుసారం బ్రతికితే ఇహంలో సుఖం లేదు. పరంలో శాంతి లేదు. అలా కాక శాస్త్రీయమైన మార్గంలో పయినించేవారు ఏది కర్తవ్యమో గుర్తించి అదే ఆచరించి దానికి తగిన సిధ్ధి పొంది తీరుతారు.