ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
14. గుణత్రయాధ్యాయయోగం
అయితే వస్తు సిద్ధంగా అంతా జ్ఞాన స్వరూపమైన ఆత్మే అయినా అదే జ్ఞేయమైన అనాత్మగా కనపడే సరికి దాన్ని గ్రహించక ఇదే సత్యమని దీన్ని పట్టుకొని సతమత మవుతున్నారు. దీనివల్ల కలిగే సుఖదుఃఖాదులను అనుభవించలేక దీనితోనే చివరకు కన్నుమూస్తున్నారు లోకులు. ఇదే సంసార బంధం. దీనికి కారణం గుణ సంగ మంటున్నది గీత. సత్వరజస్తమస్సులనే ప్రకృతి గుణాలు బంధిస్తున్నాయి మానవుణ్ణి. మనలో ఉన్నవి ఈ త్రిగుణాలే. మనస్సు సత్త్వం. ప్రాణం రజస్సు. శరీరం తమస్సు. ఇక గుణాత్మకం కాని దేది మానవుడిలో. పోతే ఈ గుణాలతో తాదాత్మ్యం Identity చెందిన నేరానికి ప్రపంచమంతా త్రిగుణాత్మకంగానే కనిపిస్తుంటుంది. ప్రపంచమంటే దేశ కాల వస్తు సముదాయమే గదా. దేశం సత్త్వమైతే, కాలం రజస్సైతే, వస్తుజాలమంతా తమస్సు. కాబట్టి బాహ్య జగత్తు కూడా గుణమయమే. దృక్ దృశ్యాలు రెండూ గుణమయమే అయ్యేసరికి బంధం తప్పదు. ఇది ఇలా ఉన్నంత వరకూ క్షేత్ర క్షేత్రజ్ఞుల ఏకత్వం సిద్ధించదు. సిద్ధించకుంటే మోక్షంలేదు మానవుడికి. అయితే ఈ బంధం నుంచి బయటపడే దెలా మానవుడు. గుడ్డిలో మెల్ల అన్నట్టు సత్త్వగుణం కొంతమేలు ఈ త్రిగుణాలలో. అది ప్రకాశకం అనామయం. వివేక జ్ఞానానికి తోడు పడుతుంది. దాని ఆసరాతో ఒక పని చేయాలి సాధకుడు. నాన్యం గుణేభ్యః కర్తారం - త్రికరణాలతో మనమే పనిచేసినా అది గుణాలే చేస్తున్నాయి. నేను గాదు. మరి నేనవరంటే గుణేభ్యశ్చపరం - గుణాలకు సాక్షిగా ఉన్న చైతన్యమే - ఇలా ప్రతిలోమంగా అనులోమంగా తన స్వరూపాన్ని పట్టుకోగలగాలి. అప్పుడే మద్భావం సోధిగచ్ఛతి. తమ పూర్ణ స్వరూపం గుర్తిస్తే జన్మమృత్యుజరా దుఖైర్విముక్తః -జనన మరణ సమస్య నుంచి బయటపడతారని హామీ ఇస్తున్నది గీత.