ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
1. విషాదయోగం
కురుక్షేత్రమేదో గాదు. సంసారం. రథం మన శరీరమే. ఇందులో కూచున్న జీవుడే అర్జునుడు. నరుడని కూడా అర్జునుడికి పేరు. పోతే సారథి కృష్ణుడు, మన బుద్ధి. జీవితమే సంగ్రామం. ఇందులో అనుకూల ప్రతికూల పరిస్ధితులే పాండవ కౌరవ సేనలు. మనబోటి జీవులే చేయాలీ యుద్ధం. చేస్తే జయమో అపజయమో చెప్పలేము. పరిస్థితులనుకూలమైతే విజయం. ప్రతికూలమైతే పరాజయమే. చాలావరకు మన మాశించిన దెప్పుడూ జరగదు. అనుకూలించదు. కనుక పరాజయమే మూడు వంతులు. అందుకే తరుచు విషాదమే ఎదురవుతుంది మానవుడికి. ఏమి కారణం. పరిస్థితులను కూలించకనా. కావచ్చు. ఎందుకను కూలించటం లేదు. అహంకార మమకారాలే దీనికంతటికీ కారణం. ఈ శరీరం మేరకే నేనని అభిమానించటం అహంకారమైతే, మిగతా దంతా నాకన్యమని చూడటం మమకారం. శరీరం వరకు ఆగిపోతే మిగతా దన్యం గాక ఏమవుతుంది. అందులో కూడా తనకు కావలసిందైతేనే మరలా మమ అని చూస్తాడు. లేకుంటే న మమ - నా కక్కర లేదని త్రోసిపుచ్చుతాడు. ఇవే రాగద్వేషాలనే ద్వంద్వాలు. వాటి వల్ల సుఖదుఃఖాలు. ఇదే సంసార బంధం. అన్నిటికీ మూలమీ అహంకారమే. అంటే దేహాత్మాభిమానం. అది మమకారానికి దారి తీస్తే - అనుకూల ప్రతికూలాలను సృష్టిస్తే - దాని వల్ల సుఖదుఃఖాది ద్వంద్వా లేర్పడుతున్నాయి. అర్జునిడి కెదురైన సమస్య ఇదే. ఇదే విషాదం. ఒక అర్జునుడికే గాదు. మనందరికీ జీవితంలో నిత్యమూ ఎదురయ్యే సమస్యే ఇది. ఈ విష వలయంలో చిక్కి సతమతమవుతుంటాడు నరుడు. వాడెంత కోటీశ్వరుడైనాఎంత నిష్ఠదరిద్రుడైనా - ఎలాటి మేధావంతుడైనా - ఏమాత్రం తెలివిలేని మూఢుడైనా తప్పదీ విషాదయోగం.