ప్రస్థానత్రయ సారం
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు
భగవద్గీత
2. సాంఖ్యయోగం
మరి ఏమిటి దీనికి పరిష్కారం. చికిత్స చేసే ముందు వ్యాధి ఏమిటో అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. వ్యాధి విషాదం. అది దేహాత్మాభిమాన రూపమైన అహంకారంవల్ల వచ్చిందని తెలిసిపోయింది. పోతే దీని నెలా పరిష్కరించుకోవాలి. సాంఖ్యమే పరిష్కారం. సాంఖ్యమంటే వేరు చేసి చూడటం. ఆత్మ అనాత్మ రెండూ కలసి కలగాపులగమయి ఉన్నాయి. శరీరానికి వేరుగా ఉంది మన ఆత్మ. అది శుద్ధ చైతన్యం. ఇది జడమీ శరీరం. సంబంధం లేదు. అయినా ఈ దేహమే నా స్వరూపమని భ్రమ పడుతున్నాము. అందుకే ఇది జన్మిస్తే నేను జన్మించానని- ఇది మరణిస్తే నేనే మరణిస్తున్నానని దీని లక్షణాలు నామీద ఆరోపించుకొన్నాను. నిజంలో నేననే జ్ఞానమెప్పుడూ మారదు. మరణించదు. చైతన్య రూపంగా అందరు నిత్యులే. దేహమే అనిత్యం. దేహి కాదు. బాల్యయౌవనాది దశలన్నీ దేహానికే గాని దేహికి అంటవు. దేహి చేతనంగా సర్వత్రా ఉన్నాడు. దాని నెవరూ నశింపజేయలేరు. నశించేవి శరీరాలే. వాటికే జనన మరణాలు. త్రిగుణాత్మకమవి. గుణసంపర్కం వల్లనే దేహి అయిన ఆత్మ జనన మరణాల పాలయి బాధ పడుతున్నాడు. అవిద్యా కామ కర్మల వల్లనే ఈ దేహ సంబంధం మానవుడికి. అవిద్య వల్ల కారణ శరీరం. కామం వల్ల సూక్ష్మ శరీరం. కర్మ వల్ల స్ధూల శరీరం - మూడూ శరీరాలతో సంపర్క మేర్పడింది. మిగతా రెండింటికీ అవిద్యే మూలం. అందుకే కారణ శరీరమన్నారు దాన్ని. తాను కాని దాన్ని తానని భ్రమపడటమే అవిద్య. అది మన చైతన్యాన్ని ఆవరించి శరీరం మేరకు తగ్గించింది. దానివల్ల మిగతాదంతా ప్రపంచంగా కనిపించి అది పొందాలనే కామ మేర్పడింది. ఇదే సూక్ష్మశరీరం. కామాని కనుగుణంగా తనకు కావలిసిందంతా పోగు చేసుకొనే కర్మ ఏర్పడింది. ఇదే స్ధూల శరీరం. అది ఫలిస్తే సంతోషం. ఫలించకుంటే విషాదం. కాబట్టి బుద్ధి యుక్తో జహాతీహ. ఆత్మ అంటే ఏమిటో దాని జ్ఞానమార్జించాలి. అప్పుడు విహాయ కామాన్ - కామాన్ని జయించగలడు మానవుడు. నిర్మమో నిరహంకారః - కామం పోవాలంటే అహం మమలు లేకుండా పోవాలి. సుఖదుఃఖేసమే- సుఖదుఃఖాది ద్వంద్వాలు సమంగా భాసిస్తాయి సాధకుడికి. ఈ స్ధితికే బ్రాహ్మీ స్ధితి అని పేరు. ఆపూర్యమాణ మచల ప్రతిష్ఠం. నదుల వెంట బడి పోదు సముద్రం. అది కదలకుండా ఒకచోట స్థిరంగా ఉంటే నదులన్నీ వచ్చి అందులో చేరిపోతాయి. అలాగే నిష్కామంగా నీవుంటే నీ దగ్గరకే వస్తాయన్నీ. ఇదీ సాంఖ్యం చెప్పే మాట.