Index
శ్రద్ధాత్రయ విభాగ యోగము
లోకంలో అందరూ మొగమిచ్చకంగా మాటాడే వారే నూటికి తొంభయి మంది. అప్రియస్యచ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః - కానీ ఒకరి కిష్టమైనా కాకున్నా వారికేది హితమో అలాటి మాట చెప్పేవారు మాత్రం చాలా అరుదు. అంతే కాదు. అలా హితం చెప్పే వాడూ లేడు. చెబితే విని దాని నర్ధం చేసుకొనే వాడంత కన్నా లేడని ఘంటాపధంగా చెబుతాడు. అప్పటికి ముఖ ప్రీతిగా మాటాడటమే కాదు గొప్ప. దానితోపాటు వారికది మేలు చేసేదయి ఉండాలి. మేలు చేయక కీడు చేసేదయితే ఆ మాట ఎంత సత్యమైనా ఎంత ఇష్టమైనా చివరకు కష్టదాయకమే. సత్యం కన్నా ప్రియంకన్నా కోరదగినది మానవుడికి హితమేనని చివరకు తేలిన విషయం.
పోతే స్వాధ్యాయా భ్యసనం చైవ. స్వాధ్యాయ మంటే తన పాటికి తాను చదువుకోటం Self Study. ఏ వేదశాఖకు తాను సంబంధిస్తే ఆ వేద శాఖను నిత్యమూ అధ్యయనం చేయటమని ప్రాచీనులు చెప్పే మాట. అయితే అది ధర్మ మీమాంస మాత్రమే కాదు. బ్రహ్మ మీమాంసకు చెందినదైతే మరీ మంచిది. అంతేకాదు. ఒక్క వేదాధ్యయనమే గాక వేదాంతాధ్యయనమే గాక వేదాంతార్ధాన్ని వివరించే మిగతా పౌరుషేయమైన గ్రంథాలేవి అభ్యసించినా అది స్వాధ్యాయం క్రిందికే వస్తుందని ఇప్పటి కాలాని కనుగుణంగా అర్థం చెప్పినా చెప్పుకోవచ్చు మనం. తప్పులేదు. మొత్తం మీద ఇదంతా వాఙ్మయం తప ఉచ్యతే. వాచికమైన తపస్సు క్రిందికి వస్తుంది.
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు