విషాద యోగము
భగవద్గీత
మనవాళ్లైనా గెలవ వచ్చు. అందులో వారివల్ల నేను పోయినా బాధే నావల్ల వారు మరణించినా బాధే. మరణ మెవరికైనా మరణమే గదా. వారు పోయి నేను బ్రతికినా ఇంతమంది పోయారే అని బాధ. అలాకాక నేను పోయి వారు బ్రతికినా అసలు నేనే పోయానే అని బాధ. ఏ పక్షంలోనూ బాధే తప్ప సుఖం లేదు. శాంతి లేదు. అని ఆ నరుడికే గాదు. ఈ నరుడికీ పట్టుకొన్న విషాదమిదే. దీనితో కుంగిపోయి రధంలో కూలబడి పోయిన వాడా నరుడే గాదు. శరీర మనే రధంలోనే ఇలా ఆలోచిస్తూ ఇందులో నుంచి బయట పడలేక పోయే ఈ నాటి నరుడు కూడా. గాండీవం స్రంసతే హస్తా త్త్వక్చైవ పరిదహ్యతే - వేపధుశ్చ శరీరేమే జాయతే అని ఆక్రందనం చేస్తున్న దానరుడే గాదు. భయసంభ్ర మాందోళనలతో దిక్కు తోచక నిత్యమూ మరణ భయం తరుముకొని వస్తుంటే మనసు పనిచేయక జీవితాంతమూ సతమత మవుతున్న మనబోటి మానవులం కూడా.
లోకంలో ఆ బాలగోపాలమూ అందరికీ పట్టుకొన్న ఏకైక సమస్య ఈ విషాదమే. విషాద యోగం పరిష్కారం కాదు. సమస్య. శాస్త్రమెప్పుడూ పరిష్కారాన్ని ఉపదేశించాలి గాని సమస్య నేకరువు పెట్టటం కాదు. సమస్య నెందుకు ప్రపంచించటం. అది మనకీ లోకానుభవంలోనే సిద్ధమై ఉన్నది. అనుభవ సిద్ధమైనది సమస్య - శాస్త్ర సిద్ధమైనది దాని పరిష్కారం. అదే రోగమూ చికిత్సా అని చమత్కారంగా వర్ణిస్తూ వచ్చా మింతవరకూ.
Page 34