ఇదంతా ధర్మ పురుషార్ధం క్రిందికి వస్తుంది. చైతన్యం మనః ప్రాణాలనే ఉపాధులమేరకు ఉందనేంతవరకు అది ధర్మక్షేత్రం. ధర్మమంటే పట్టుకొని కూచున్నదని అర్థం. కర్మ కర్మ ఫలం అనుభవం పట్టుకొనే ఉంటాయి. మనలను. అవి ఉన్నంతవరకూ జీవ భావం తప్పదు. జీవ భావం ఉన్నంతవరకూ జనన మరణాలు జీవుడికి చెప్పరాదు. జీవుడే మరణిస్తే లోకాంతరాలకు వెళ్ళవలసిన వాడెవడు. సుఖదుఃఖాలు అనుభవించ వలసిన వాడెవడు. మరలా జన్మించ వలసిన వాడెవడు. యోని మన్యే ప్రపద్యంతే -శరీరత్వాయ దేహినః - స్థాణుమన్యే ప్రపద్యంతే యధా కర్మ యధా శ్రుతం అని శాస్త్రమే ఘోషిస్తున్నది. కాబట్టి ప్రారబ్ధం తీరగానే శరీరం పోవలసిందే గాని శరీర ధారి అయిన జీవుడు పోడు. ఇది కాకుంటే మరొకటి ధరించి ఉంటాడు. ఏ శరీరమూ లేనప్పుడే జీవ భావం తొలగి పోయేది. శరీరమంటే అది స్థూలమే గాదు సూక్ష్మం కూడా అని చెప్పాము. స్థూలం పోయినా సూక్ష్మముంటుంది. సూక్ష్మం కూడా పోవాలంటే దానికి నిమిత్తమైన కారణ శరీర మొకటుంది. అది పోవాలి. అదేదో గాదు. మానవుడి అజ్ఞానమే. జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. ఆత్మానాత్మలు రెండూ ఆత్మ స్వరూపమే అని భావించటమే జ్ఞానం. ఇది లేనందువల్లనే ఆత్మ అనాత్మ అనే భేద దృష్టి ఏర్పడింది. అదే జీవభావానికి జనన మరణాదులకు దారితీస్తున్నది.
పోతే ఇప్పుడీ భేద దృష్టికి స్వస్తి చెప్పి అంతా ఆత్మేనని అభేద దృష్టి నలవరుచుకో గలిగితే అది జ్ఞానం. అజ్ఞానా వస్థలో జీవుడు జనన మరణాలు అన్నీ ఉంటే - జ్ఞానావస్థలో ఏ ఒక్కటీ లేదు. అక్కడ శరీరమనః ప్రాణాలనే ఉపాధులతో సంబంధముంది కాబట్టి వాటి వల్ల కలిగే జనన మనణాదులు కూడా ఉన్నాయి.
Page 97