#


Index

  చైతన్యం గనుక ఈ స్థూల శరీరం పట్టు వదిలినా మరొక సూక్ష్మ శరీరం దానికి తగులుకొని ఉంటుంది. మనః ప్రాణాలే ఈ సూక్ష్మ శరీరం. రక్త మాంస చర్మాస్థి మయమైన స్థూలం లాగా ఇది కంటికి గోచరం కాదు గనుక దీన్ని సూక్ష్మమన్నారు. జీవుడి అస్తిత్వాన్ని ఇది మనకు పట్టి ఇస్తుంది. కాబట్టి లింగమని కూడా పేర్కొన్నారు. స్థూలం రేపు పడిపోగానే ఇది బయటికి వస్తుంది. దీనితో పాటు దీని నభిమానించే జీవుడు కూడా బయటికి వస్తాడు.

  ఉత్రమణ మంటే ఇదే. మనసు దారి చూపుతుంటే ప్రాణం కదలి పోతుంటుంది. అది జీవుణ్ణి ఆయా లోకాలకు తీసుకెళ్ళుతుంది. కర్మణా పితృలోకః కేవల కర్మాచరణులు ధూమ మార్గంలో పితృలోకం చేరితే విద్యయా దేవలోకః ఆయా దేవతల నుపాసించిన వారు జ్యోతిర్మార్గంలో ఆయా దేవలోకాలు చేరుతారు. రెండూ గాక నిషిద్ధ కర్మలు చేసిన వారైతే సరాసరి యమలోకానికి పోయి రౌరవాది నరకా లనుభవిస్తారు. దేవలోకాలలో వారికి భోగ శరీరమైతే నరకంలో యాతనా శరీర మొకటి సంక్రమిస్తుంది వారికి. వారికా అనుభవాలన్నీ పూర్తి అయి మరలా జన్మ ఎత్తేవరకూ వారికీ ఈ కర్మభూమిలో ఉండే మనకూ కానరాని సంబంధ మొకటి ఉంటుంది. అది మనః ప్రాణాల వల్ల ఏర్పడింది. కనుక ఆ వంశంలో వారి రక్తం పంచుకొని పుట్టిన మనమంతా వారికి ఋణపడి ఉన్నాము. మనః ప్రాణాల వల్ల వారికి క్షుత్పిపాస లేర్పడుతాయి కాబట్టి అవి నివారించటానికి పిండప్రదానమూ జలతర్పణమూ చేయవలసి ఉంది మనం. స్థూల దేహం లేక వాయు రూపంగా నగ్నమై ఉంటారు. కాబట్టి వస్త్ర దానం కూడా చేయాలని మన భావన.

Page 96