పరమార్థంలో కాకపోయినా వ్యావహారికంగా నైనా ఉండితీరుతాయి. మరి ఇక్కడ ఆ ఉపాధులు కూడా స్వరూపంగానే భాసిస్తాయి కాబట్టి తన్నిమిత్తమైన జనన మరణాదుల ఊసే లేదు. అవి కూడా ఆత్మ స్వరూపమే. దీనికే అశరీర మమృతమని పేరు పెట్టింది. శాస్త్రం. అశరీర మన్నప్పుడిక మరణం లేదు. నతస్య ప్రాణా ఉత్ప్రేమంతి. వాడి ప్రాణాలు ఉత్రమణ చెందవు. సముద్రంలో తరంగాలలాగా వాడి చైతన్య సాగరంలోనే అణిగి పోతాయట. మరణ మనేది అందరికీ సంభవిస్తున్నట్టు కనిపిస్తుంది మనకు. అయితే అది ఒక్కొక్కరి కొక్కొక్క విధం. చివరకు ప్రయాణమనేది అందరికీ సమానమే. ఉపాధి ఉన్నప్పుడు అది పోవలసిందే గదా. అయితే అది ఒక హనుమాన్ జంక్షను లాంటిది. నాలుగు దారులున్నాయి అక్కడ.
అందరూ ఒక దారిలో కాక నలుగురూ నాలుగు దారులలో ప్రయాణమై పోతారు. అతి నికృష్టంగా బ్రతికి పోయిన వారు యమలోకానికి. సత్కర్మలు చేసిన వారు పితృలోకానికి. ఆయా దేవతోపాసకులు దేవలోకాలకు. పోతే సగుణబ్రహ్మో పాసకులు నేరుగా సత్యలోకానికి. ఈ నాలుగవ వారు మాత్రం వెనక్కు రారు మరలా. బ్రహ్మదేవుడితో పాటు నిర్గుణ జ్ఞానాన్ని అభ్యసించి క్రమంగా ముక్తులయిపోతారు. దీన్నే క్రమముక్తి అని పేర్కొంటారు. మిగతా ముగ్గురికి మాత్రం పునరావృత్తి తప్పదు.
పోతే ఈ నలుగురు గాక ఇంకొక రున్నారు. వారే జ్ఞానులు. వారు తమ ఆత్మ చైతన్యాన్నే సర్వత్రా దర్శిస్తుంటారు. సర్వమూ అదేనని చూస్తుంటారు. వారికి జీవుడైనా నేనే. జగత్తయినా నేనే. ఈశ్వరుడైనా నేనే. అంతా నేనే. నాదంటూ లేదూ వారికి. అలాంటప్పుడు మరణ మేముంది. జనన మేముంది.
Page 98