#


Index

  కదలికనేది ఉంటే గదా అవి రెండూ. కదలికంటే ఒకటి వదిలేసి వేరొకటి పట్టుకోవడం. అంతా స్వరూపమే అయినప్పుడు ఒకటి వదిలేయటమే లేదు. సముద్రంలో తరంగాల లాగా సర్వమూ వారి చైతన్యం లోనే కరిగి పోతాయి. కనుకనే వారి ప్రాణాలు ఉత్రమణ చెందవని చెప్పటం. స్థితే గాని గతి లేదు జ్ఞానుల విషయంలో.

  అయితే జ్ఞానులు కూడా నలుగురితో పాటు మరణిస్తారని చెప్పారే. ఆ మాటకర్థ మేమిటి. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. మరణించట మనేది వాస్తవమే కాని ఆ మరణించేది జ్ఞాని కాదు. అతని ఉపాధి. ఉపాధి అంటే శరీర మనః ప్రాణ కర్తృత్వ భోక్తృత్వాది సంఘాతం. ఇదెక్కడిది. ఇది ఆ జ్ఞాని చైతన్యం తాలూకు ఆభాస. చైతన్యం వెలుగైతే ఇది ఆ వెలుగు చిమ్మిన నీడ. నీడకు వేరే అస్తిత్వం లేదు. వెలుగు ప్రసరిస్తే అది వెలుగే అయిపోతుంది. ప్రసరించనంత వరకే అది దానికి విజాతీయంగా కనిపిస్తుంది. జ్ఞాని జీవితాంతమూ తన చైతన్య జ్యోతినే తన స్వరూపమని భావిస్తూ దానికేది గోచరిస్తున్నా అది ఆ జ్యోతిశ్చక్రంలో ఒక కిరణం లాగా దర్శిస్తుంటాడు. కాబట్టి అంతా జ్యోతిస్సే. తమస్సు లేదా దృష్టికి. అంటే ఆత్మే గాని అనాత్మ స్పర్శే లేదని అర్థం. లోకుల దృష్టికే వాడూ వాడి శరీరమూ వేరుగా కనిపిస్తాయి. వాడి దృష్టికంతా స్వరూపమే. ఇంతెందుకు. ఒక మహాసాగరాని కెదురుగా నిల్చొని చూస్తుంటే ఎలా కనిపిస్తుంది. జలంగానే కాక తరంగాలుగా బుద్బుదాలుగా ఫేనంగా తుషారంగా భిన్న భిన్నంగా గోచరిస్తుంది. కాని అది చూచే మనబోటి వారి దృష్టికే. మరి దాని దృష్టికో. ఇవి ఏవీలేవు. అన్నీ కలిసి ఏకంగా జలమే.

Page 99