మొదట చెప్పిన భావం రౌద్ర బీభత్స భయానకాలను ద్యోతనం చేయాలి కాబట్టి అది ఆరోహణాత్మకమే కావలసి ఉంది. పైగా యమమహిష అన్నప్పుడెక్కడో ఊర్థ్వలోకాలకు సంబంధించిన వ్యవహారం గదా అది. అంచేత తదను సారిగా రచన ఊర్ధ్వముఖంగానే సాగటం ఎంతైనా శోభావహం. అలాగే రెండవది శమ ప్రధానమైన ఖండం కాబట్టి అది అవరోహణలో నడవడమే అందం. పైగా ఎక్కడో వినువీధులలో గాదు. భూమిమీద హస్తి పురిలో కౌరవుల సభలో తానాడవలసిన మాటలవి. కనుక రచన అవరోహణాత్మకంగా సాగటమే సముచితం. ఇక్కడ మరి ఒక రమ్యత ఏమంటే పద్యం ఎత్తుగడ సమాసజటిలంగా ఆరంభమయింది. తరువాత కొన్ని తడిపొడి తెలుగు మాటలతో సాగింది. అలా సాగినా సంస్కృత సమాసంతో చేతులు కలిపి అవి కూడా ఊర్ధ్వాభిముఖంగా పయనించటమే వింత. మరి అలాంటి పొడిపొడి మాటలే అయినా ఇష్టము లగునే దగ్గర నుంచి నడకలో ఒక సడలిక ఏర్పడి అది నిమ్నాభిముఖంగా సాగటం ఇంకా వింత. పద ప్రయోగం కూడా ఎంతో అభిప్రాయ గర్భంగా కనిపిస్తుందిక్కడ. ఘంటికా నాదమొకటైతే శాంత వచనాలు మరొకటి. నాదానికుండే ప్రచండత వచనాని కెక్కడిది. పైగా అర్ధంలేనిది నాదమైతే అర్థప్రకాశకమైనది వచనం. అయినా అర్థరహితమైన నాద మార్భాటంగా చెవుల బడుతుంటే ఇది దాని అనురణనంతో అణిగి పోవలసిందే. అందుకే అది ఊర్ధ్వగామి అయితే ఇది అధోగామియై దానిలో లీనమైనట్లు భాసించటం.
Page 26