#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

కావచ్చు గాని ఈశ్వరుడి శరీర మనిత్యమెలా అవుతుందని అపోహలో ఉండవచ్చు పాండవులు. ఉన్నారు కూడా. లేకుంటే నిత్యమూ మాదగ్గరే మమ్ముల్ను అంటి పెట్టుకొని ఉండమనే మాటరాదు. కుంతీ అన్న దామాట పాండవులూ అన్నారు. ఇంకా వారికి శరీర భ్రాంతి పోలేదనుకున్నాడు పరమాత్మ. అంతేకాదు. తన్నుకూడా ఈ నీలమేఘ శ్యామలమైన శరీరం మేరకే దించి చూస్తున్నారని గ్రహించాడు. ఎప్పటికైనా ఈ శరీరమే కాదాత్మ అంటే దీనికి విలక్షణమైన తత్త్వమనే భావం దృఢపడాలని ఆలోచించాడు. అలా దృఢపడాలంటే తన శరీరమింకా దృగ్గోచర మవుతున్నంత వరకూ వారికది కలిగే అవకాశం లేదు. ఇంకా ఆ మైకంలోనే ఉండిపోతారు. అంచేత వారు జీవించి ఉండగానే తాను కన్ను మూశాడు. శరీరమిక్కడే విడిచిపోయాడు. అది దైవికంగా అర్జునుడి కంటనే పడేట్టు చేశాడు. అది చూచేసరికి అంతకుముందు విన్న సాంఖ్యయోగం బాగా తలకెక్కింది అర్జునుడికి. దేహం వేరు దేహి వేరనేది ఎంత విన్నా అది సిద్ధాంతమే. దృష్టాంతంగా చూచినప్పుడే అది బాగా ఒంట బట్టేది, అనుభవంగా మారేది. అది పరమాత్మ విషయంలోనే చూచేసరికి హడలిపోయా డర్జునుడు. ఇక కై ముతిక న్యాయంచేత తమ శరీరాల శాశ్వతమని చెప్పనే అక్కరలేదతనికి. అప్పుడర్ధమయిందతనికి ఎవరి శరీరమైనా శాశ్వతం కాదని. అంతేకాదు. శరీరమే కాకపోతే తన్మూలంగా ఏర్పడిన ప్రాపంచిక భోగభాగ్యాలసలే గాదు. కనుక వాటినిక ఏ మాత్రమూ అంటిపట్టుకోరాదు. అంటిపట్టుకోవలసిన దెప్పటికైనా శాశ్వతమైన ఆ పరమాత్మ తత్త్వాన్నే. ఇదే గాక ఇంకొక రహస్యం కూడా బోధపడిం దర్జునుడికి. అంతకు ముందంతా తమ కర్తృత్వంతో ఏదో సాధించామనీ పడబొడిచామనీ అనుకొన్నదంతా వట్టి భ్రమే. అందుకు నిదర్శనం కృష్ణుడు వెళ్లిపోగానే తన అసహాయ స్థితి. అశక్తత. “మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రమ్ భవ సవ్యసాచిన్" అన్న భగవద్వాక్యం కూడా వట్టి సిద్ధాంతం కాదు దృష్టాంతమని అప్పుడర్థమయిందా మానవుడికి.

  ఎంత పలవించినా ఇక ప్రయోజనం లేదని చెప్పి రామకృష్ణాదుల శరీరాల కగ్ని సంస్కారం చేసి బయలుదేరుతా డర్జునుడు హస్తినాపురానికి. పదహారు వేల మంది కృష్ణకాంతలను కూడా వెంటబెట్టుకొని వస్తాడు. వచ్చీ రావటంతోనే అన్నగారి కాళ్ల మీద బడి బోరుమని ఆక్రందనం చేస్తాడు. ఇంగితజ్ఞుడైన ధర్మజుడా ఆకృతిని

Page 262

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు