చూచి చూచి ఎప్పుడు దెబ్బ తీయాలో అప్పుడు తీస్తాడు. అది ఎలా తీస్తాడో ఏ ప్రాణికీ అంతుపట్టదు. ఇది ఆ వానర జీవుడి మనసుకు తేవటానికే-అజ్ఞాతంగా దైవహస్త మొకటి పనిచేస్తుందని హెచ్చరించటానికే ఈ చెట్టు చాటు బాణ ప్రయోగ నాటకం.
మరి సుగ్రీవుడికి మాట ఇచ్చాను కాపాడుతానని అనటం దేనికి. ఆ మాట వాలికే ఇచ్చి అతనితో సఖ్యం చేయవచ్చును గదా. దీనికి రెండు జవాబులు చెప్పవచ్చు మనం. ఒకటి రాజనీతి. మరొకటి దండనీతి. వాలి అసహాయ శూరుడు. అంత బలవంతుడైనా అతని దగ్గర సహాయ సంపద లేదు. హనుమ జ్ఞాం బవదాది మహావీరులంతా సుగ్రీవుడి దగ్గరే ఉన్నారు. అతణ్ణిఆశ్రయిస్తే వారందరూకలిసి తనకు బాసటగా ఉంటారు. సీతాన్వేషణకు పనికి వస్తారు. పైగా సుగ్రీవుడికి భూమి నాలుగు దిక్కులూ తిరిగిన అనుభవమున్నది. ఎక్కడెక్కడి వర్తమానమూ సేకరించగలడు. వాలితోనే మైత్రి చేస్తే సహజంగా బలవంతుడైన వాలి మరీ బలవంతుడై పోతాడు. అతడి వల్ల తన కార్యం సానుకూలమైనా ఎప్పటికైనా తనకే అతడు ముప్పు తెచ్చి పెట్టవచ్చు. పైగా జయ మతనిదే అవుతుంది గాని తనదిగాదు. దానివల్ల లోకంలో గౌరవంలేదు తనకు. సుగ్రీవుడితోనే అయితే తద్వారా బలవంతుణ్ణి రూపుమాపవచ్చు. బలహీనుడి కుపకారం చేసినట్టూ అవుతుంది. అలాటి వాడెప్పుడూ తన్ను మించిపోలేడు. మీదు మిక్కిలి తన కార్యమూ ఫలిస్తుంది. ఇది రాజనీతి.
పోతే సన్మార్గుణ్ణి కాపాడటమూ దుర్మార్గుణ్ణి శిక్షించటమూ-దండనీతి లక్షణం. సుగ్రీవుడితో మైత్రి చేస్తేనే దాని కనుగుణంగా నడుచుకొన్న ట్టవుతుంది. లేకుంటే ఇన్ని ధర్మ పన్నాలు వల్లించిన తానే అధర్మపరుడని చెడ్డపేరు తెచ్చుకున్న వాడవుతాడు రాముడు. ఇదీ ఇక్కడ మనం చెప్పుకోవలసిన సమాధానం.
Page 85