పాండవ నిర్యాణానికి ముందే జరిగింది కృష్ణ నిర్యాణం. వారు బ్రతికి ఉండగానే తాను పోయాడు. ఏమిటి దీనిలో అంతరార్థం. ఎప్పటికైనా వారు తెలుసుకోవా లొక రహస్యం. తానే గదా బోధించా డర్జునుడికి. "అంత వంత ఇమే దేహా- నిత్యస్యోక్తా శ్శరీరిణః" అని. దేహి అయిన జీవుడే నిత్యంగాని అతడు ధరించిన దేహం నిత్యం గాదు. అది జీవుడి దేహమైనా సరే ఈశ్వరుడి దేహమైనా సరే అనిత్యమే. జీవుడి దంటే కావచ్చు గాని ఈశ్వరుడి శరీర మనిత్య మెలా అవుతుందని అపోహలో ఉండ వచ్చు పాండవులు. ఉన్నారు కూడా. లేకుంటే నిత్యమూ మాదగ్గరే మమ్మల్ను అంటి పెట్టుకొని ఉండమనే మాటరాదు. కుంతీ అన్న దామాట. పాండవులూ అన్నారు. ఇంకా వారికి శరీరభ్రాంతి పోలే దనుకున్నాడు పరమాత్మ. అంతేకాదు. తన్ను కూడా ఈ నీలమేఘ శ్యామలమైన శరీరం మేరకే దించి చూస్తున్నారని గ్రహించాడు. ఎప్పటికైనా ఈ శరీరమే కాదాత్మ అంటే దీనికి విలక్షణమైన తత్త్వమనే భావం దృఢ పడాలని ఆలోచించాడు. అలా దృఢ పడాలంటే తన శరీర మింకా దృగ్గోచర మవుతున్నంత వరకూ వారి కది కలిగే అవకాశం లేదు. ఇంకా ఆ మైకంలోనే ఉండి పోతారు. అంచేత వారు జీవించి ఉండగానే తాను కన్ను మూశాడు. శరీర మిక్కడే విడిచి పోయాడు. అది దైవికంగా అర్జునుడి కంటనే పడేట్టు చేశాడు. అది చూచే సరికి అంతకు ముందువిన్న సాంఖ్యయోగం బాగా తల కెక్కింది అర్జునుడికి. దేహం వేరు - దేహి వేరనేది ఎంత విన్నా అది సిద్ధాంతమే. దృష్టాంతంగా చూచినప్పుడే అది బాగా ఒంట బట్టేది. అనుభవంగా మారేది. అది పరమాత్మ విషయంలోనే చూచే సరికి హడలి పోయా డర్జునుడు. ఇక కై ముతిక న్యాయం చేత తమ శరీరా లశాశ్వతమని చెప్పనే అక్కర లేదతనికి. అప్పుడర్ధ మయిందతనికి ఎవరి శరీరమైనా శాశ్వతం కాదని. అంతేకాదు. శరీరమే కాకపోతే తన్మూలంగా ఏర్పడిన ప్రాపంచిక భోగ భాగ్యాలసలే గాదు. కనుక వాటినిక ఏ మాత్రమూ అంటివట్టు కోరాదు. అంటి పట్టు కోవలసిన దెప్పటికైనా శాశ్వత మైన ఆ పరమత్మ తత్త్వాన్నే. ఇదే గాక ఇంకొక రహస్యం కూడా బోధపడిం డర్జునుడికి. అంతకు ముందంతా
Page 155