మూర్తీభవించి చిత్రవిచిత్ర భంగిమలతో నాటకంగా పరిణమించింది. ఇది కవిసృష్టి అయితే సహృదయుడి దృష్టి దీనికి భిన్నంగా ఉండాలి. కవిది సృష్టి, సహృదయుడిది లయం. లయంలోనే మనం ధ్యేయాన్ని అందుకోగలం. కారణమేమంటే అనేకం ఏకమయ్యేది లయంలోనే. అదేగదా కళాపరమార్ధం. కాబట్టి జగల్లయంలో రూపం నామమై- ఆనామం ఎలా విశ్వశక్తిగా మారి తన గమ్యాన్ని చేరుతుందో అలాగే కళా జగల్లయంలో కూడా నాటకం నాదాత్మకమైన సంగీతానికి దారితీస్తే ఆ సంగీతకళ నాదాతీతమైన అనుభవానికి మన హృదయాలను తీసుకుపోవాలి. అలా తీసుకుపోగలిగినపుడే వాటియందా లక్షణం సార్ధకమవుతుంది.
ఈ దృష్టితో చూచే భావకుడికి నిజంగా ఒక ఉత్తమ నాటకాన్ని చూచివచ్చిన తరువాత ఆ మాటలూ ఆ అభినయాలూ అన్నీ కలిసి విచిత్రరీతులలో గమకాలలో నడిచిన ఒక రాగసంచారం కనిపిస్తుంది. ఆ రాగసంచారంలో కూడా ఎన్ని భంగిమలున్నా ఎన్ని ఆరోహణావరోహణలున్నా- ఎన్ని మలుపులు - విరుపులున్నా చక్కగా మనసు చేర్చి అనుసంధానం చేసేవాడికంతా ఒకే ఒక శ్రుతికి బద్ధమై ప్రసరించే ఒకే ఒక నాదంగా భాసిస్తుంది. ధారావాహికమైన ఆ నాదాన్ని అలాగే అనుసరిస్తూపోతే అది కొంతకాలానికసలే వినిపించదు. అదే నాదాతీత దశ. నాదానికది లయస్థానం. సంగీతంలో నిజమైన లయ ఇదే. చిత్తమెక్కడ లయమవుతుందో అదే లయ. భావకుడి చిత్తమక్కడ తల్లయమూ తన్మయమూ అవుతుంది. నాదం భావకుడి స్వరూపం గానే పరిణమిస్తుంది. ఎవరెష్టు లాంటి ఒక అనుభవ శిఖరాన్ని ఆరోహించి నట్టవుతుంది. ఆ శిఖరం మీదనే విశ్రాంతి చెందుతాడు భావకుడు. అంతేకాదు ఆ శిఖరం మీదినుంచి చూచే భావకుడికీ జగత్తంతా ఏకరూపమైన ఆ ఉదాత్తానుభూతికి ఒక విభూతిలాగా గోచరిస్తుంది. ఇదే అనేకత్వంలో ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వం, కళాజగత్తు ఆశించే పరిపూర్ణతకూడా ఇదే, సంగీత నాటకాలనేవి రెండూ ఈ పరిపూర్ణత్వానికి రెండు భాగస్వాములు.
Page 95