మహాకవి సంగీత నాటకాలను రెండింటిని అసలు యధార్థమైన కళలుగా భావించి అసత్యాన్ని భంగ్యంతరంగా అభిజ్ఞాన శాకుంతలంలో చాటినట్లు కనిపిస్తున్నది. “రమ్యాణివీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్-పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః' అని ఆయన వాణి. మధురమైన ఒక శబ్దం చెవిన బడినా రమణీయమైన ఒక దృశ్యం కంటబడినా ఎలాంటి జనులకైనా హృదయం స్పందించి తీరుతుందట. ఆయన ఉద్దేశించిన శబ్దమూ, రూపమూ, అక్కడ ఏదైనా కావచ్చు. కాని ఆమాటలనే టప్పుడాయన నోట అప్రయత్నంగా సంగీత నాటక కళలను గురించి కూడా పరామర్శ చేసినట్టయిందని చెప్పవచ్చు. మధురమైన శబ్దం సంగీతమూ, రమ్యమైన రూపం నాటకమూ కాక మరేమిటి?
సంగీత నాటకాల కింత మహోన్నత స్థానం లభించటానికి శబ్దమూ రూపమూ అనే రెండు లక్షణాలే కారణం. శబ్దరూపా లాకర్షించినంతగా మానవహృదయాన్ని మరి ఏది ఆకర్షించలేదు. కనుకనే ఎప్పుడూ వినాలనీ చూడాలనీ ఉంటుంది మనకు. అసలీ జగత్తంతా ఈ రెండు తత్త్వాల మీదనే ఆధారపడి ఉంది. ఒకటి శబ్దమూ మరొకటి రూపమూ, అనే వేదాంతుల భాషలో నామరూపాలు-యోగపరిభాసలో నాదకళలు, నాదమే సృష్టికాధారం. అదే వాగ్దేవత అయిన సరస్వతి. అమూర్తమైన ఆనాదం మూర్తీభవిస్తే కళ అవుతుంది. అదే జగత్సితి కారిణి అయిన లక్ష్మి. ఈ రెండింటికి మూలభూతమైన తత్త్వమే బిందువు. అది ఈ సకల చరాచర జగద్వ్యవహారానికే కేంద్రస్థానం. ఆ కేంద్రం నుంచే వెలువడింది ఈ ప్రపంచం. మరలా ఆ కేంద్రంవైపుకే ప్రయాణం చేస్తుంది అనులోమంగాభావిస్తే సృష్టి ప్రతిలోమంగా భావిస్తే లయం. రెండింటికీ కేంద్రస్థానమైన ఆ బిందువు మూలం. అదే శక్తిస్వరూపిణి అయిన పార్వతి. ఇలా భావన చేసిననాడు సృష్టిలో సంగీతకళా-స్థితిలో నాటకకళా అంతర్లీనమై ఉన్నట్టు భావకుడి మనస్సు భావిస్తుంది. క్రమబద్దమై లయాత్మకమైన ఈ సృష్టి అంతా సంగీతం కాక మరేమిటి. అట్లాగే సమస్త ప్రాణుల ఈ భావాలూ ఈ మాటలూ ఈ కదలికలూ నాటకంకాక మరేమిటి. కనుకనే దీనిని జగన్నాటకమనీ ఆ పరమేశ్వరుణ్ణి ఈ జగన్నాటకానికి సూత్రధారుడనీ చక్కగానే చెప్పారు మన పూర్వులు. శబ్దం సంగీతానికీ- రూపం నాటకానికీ ప్రతీకలని చెప్పాము. ఇందులో ఒక సబబు కూడా ఉంది. శబ్దమనేది అమూర్తం. అమూర్తమే సంగీతం. అదే మూర్తమైతే రూపం. మూర్తస్వరూపమే నాటకం.
Page 93