#


Index

చిత్రతరంగిణి

అలాంటప్పుడు విష్ణువేమిటి - శివుడేమిటి - శక్తి ఏమిటి - బ్రహ్మేంద్రాది దేవతలేమిటి అన్నీ ఒకే ఒక పరమాత్మ చైతన్యానికి చెందిన విభూతి శకలాలే. అందులో ఏ అంశాన్ని పట్టుకొన్నా పట్టుకోవచ్చు. దేన్ని భజించినా భజించవచ్చు. తప్పులేదు. కాని ఒక్క షరతు. ఏదేవతను సేవించినా మిగతా దేవతలకు విముఖులు కావటంగానీ అదేపనిగా వారిని నిందించటం గానీ పనికి రాదు. అది మహాపాపం. ఎందుకంటే ఆ రూపంలో ఉన్న పరమాత్మనే నీవు నిందిస్తున్నావు. మనస్సుకు విక్షేపం లేకుండా ఏకాగ్రత ఏర్పడటం కోసం నీవొక ఇష్టదైవతాన్ని ఆరాధిస్తూ ఉండవచ్చు. అంత మాత్రాన దేవతాంతర దూషణ చేయాలని ఎవరు చెప్పారు నీకు. అయితే అన్నీ ఆ పరమాత్మరూపాలు కావా. అలాంటి సమష్టి భావన చెదరకుండా భజించినప్పుడే వ్యష్టి ఎప్పటికైనా సమష్టివైపు తీసుకుపోచాలి మనలను, అదే వ్యష్టి ప్రయోజన మసలు. లేకుంటే సాధనాన్నే గమ్యమని భావించి బోల్తాపడే ప్రమాదముంది. అలాంటి ప్రమాదంలో పడితే మానవుడి కిక నిష్కృతి లేదు. అంచేత సమస్త దేవతా రూప సామరస్యాన్ని దర్శించాలి మనం సాధకులుగా.

  ఈ సామరస్యాన్ని మన కనుక్షణమూ జ్ఞాపకం చేయటానికా అన్నట్లు వెలశా డీ ఏడుకొండల వేంకటేశ్వరుడు. శివుడో - మాధవుడో కమలాభవుడో ఎవడో తెలియని రూపమిది. అన్ని రూపాలనూ లోగొన్న దేవతా రూపం. శ్రీ వేంకటేశ్వరుడని పేరు పెట్టడంలోనే దాగి ఉన్నదా రహస్యం. వికుంఠశబ్ద వికారమే కాబోలు వెంకట. వికుంఠుడంటే విష్ణువే గదా. పోతే ఈశ్వరుడు సరే సరి. పరమశివుడే. మరి ఆ వికుంఠుని నాభికమలం నుంచి జనించిన వాడే కమల సంభవుడు బ్రహ్మ. అది వేంకట అనే మాటలోనే కలిసి వచ్చింది. కాబట్టి వేంకటేశ్వరుడంటే త్రిమూర్త్యాత్మకమైన తత్త్వమే. అంతే కాదు. దీనికిపై పెచ్చుగా శ్రీ అనే మాట ఒకటుంది. దాని వికృతి రూపమే తిరు. తిరుపతి అంటే శ్రీపతే. శ్రీపత్ని అయితే ఆయన పతి. పతి పత్నుల కెడబాటు లేదు. ఆవిడ ఆయనకు నిత్యానపాయిని. ఆవిడ ఇంతకూ ఆ పరమాత్మ శక్తి. “పరాస్య శక్తి ర్వివిధైవ శ్రూయతే- స్వాభావికీ" అన్నది ఉపనిషద్వాణి. అది ఆ ఈశ్వరునికి స్వభావసిద్ధమట. 'శక్తి శక్తి మతో రభేదః' అని గదా సిద్ధాంతం. ఈ శక్తిని వశీకరించుకొనే ఆ ఈశ్వరుడీ జగన్నాటకమంతా ఇలా ప్రదర్శిస్తున్నాడు. అది లేకపోతే ఆయన స్థాణువు. నిత్యమూ అది ఆయన నాశ్రయించి ఉండ వలసిందే. ఆశ్రయ తీతి శ్రీః. ఆశ్రయించేది గనుకనే శ్రీ అయింది శక్తి.

Page 77

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు