పోతే మన అనుభవంలో ఉన్న ఈ శరీరత్రయానికీ మన స్వరూపమైన జీవుడికీ ఏమిటి సంబంధం? ఏమీ లేదు వాస్తవానికి. జీవుడంటే శుద్ధ చైతన్యం. శరీరమనేది జడం. జడానికి తానున్నాననే ప్రజ్ఞలేదు. కాబట్టి దాని అస్తిత్వానికొక సాక్షి కావాలి. ఆ సాక్షి చేతనుడైన జీవుడే. అలాంటప్పుడు జీవుడు జడమైన శరీరమెలా అవుతాడు. అతడు సాక్షి. ఇది సాక్ష్యం. సాక్ష్యమైన పదార్థం సాక్షి కానేరదు. సాక్షి అయినది సాక్ష్యం కాజాలదు. ఒక దానితో ఒకటి కలిసి ఉన్నా ఒకటి కాలేవు. దేనిపాటికదే. తిలలూ బియ్యమూ కలగాపులగం చేసినా తిలలు తిలలే బియ్యం బియ్యమే. అలాగే జీవుడీ శరీరంతో పెనవేసుకొని ఉన్నట్టు కనిపించినా శరీర సాంగత్యం వాస్తవానికి లేదు. లేకున్నా ఉందనుకోవటం భ్రాంతి. ఘటమఠాకాశ దృష్టాంతేన సంగీతి భ్రుమో నివృత్తః. ఒక విశాలమైన మఠంలో ఒక ఘటముంది. అవి రెండూ తప్ప అక్కడ మరేవీ లేవు. లేవంటే వస్తు సామగ్రి లేదనే గాని కావలసినంత ఖాళీ ఉంది. ఖాళీకే ఆకాశమని పేరు. అది మఠంలో ఉంది. ఘటంలోనూ ఉంది. రెండింటి మేరకే అది పరిమితమైన దానిలా కనిపిస్తుంది. అవి రెండూ దాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొన్నట్టు భాసిస్తుంది. కాని ఇది యధార్థం కాదు కదా. ఆకాశమనేది ఒక అమూర్తమైన పదార్థం. అమూర్తమైనదెపుడూ వ్యాపిస్తుంది. వ్యాపకమైన పదార్ధాన్ని ఎక్కడో ఒక మూలపడి ఉన్న ఘటాది పదార్ధాలు తమలో ఎలా ఇముడ్చుకోగలవు. మీదు మిక్కిలి ఇవే దానిలో ఇమిడి ఉంటాయి. అలా ఉన్నా ఒకటి నిరాకారం మరొకటి సాకారం గనుక రెంటికీ సంసర్గమేర్పడటం కల్ల. ఏర్పడిందనుకోటం మన భ్రాంతి.
అలాగే ప్రస్తుతమీ ఆత్మ అనేది శుద్ధ చైతన్యం. చైతన్యాని కాకాశంలాగా రూపం లేదు. కనుక సర్వవ్యాపకం. శరీరమో అది స్థూలమే కావచ్చు. సూక్ష్మమే కావచ్చు. అలా వ్యాపకం కావు. మనః ప్రాణాలు కూడా స్థూలాన్ని అంటి పెట్టుకొనే ఉంటాయి. ఆఖరుకు ఆవరణ రూపమైన కారణ శరీరం కూడా స్వప్రకాశం కాదు. గనుక అదీ పరిచ్ఛిన్నమే. కాబట్టి చైతన్యానికీ శరీరాలకూ ఎలాంటి పొత్తూ కలగబోదు. కలిగినట్టు చేసినట్టు మన భ్రమే కాని మరేమీ కాదు. ఘట మఠాదులున్నా సరే. వాటిలోపలా వెలపలా సర్వత్ర వ్యాపించినట్టు ఆకాశాన్ని ఎలా దర్శిస్తామో అలాగే శరీరత్రయమనేది త్రిపురాసురలలాగా ఆవరించి ఉన్నా మన ఆత్మ చైతన్య మాకాశంలాగా అండ పిండ బ్రహ్మాండాలనన్నింటినీ వ్యాపించి అంతటా ప్రసరిస్తున్నట్టు దర్శించాలి మనం.
Page 244