#


Index

చిత్రతరంగిణి

సైరంధ్రి నిష్ఠుర మాడితే అతడు నీవూ వాడూ ఏమి మటాడారో నాకేమి తెలుసునంటాడు. నేనేమీ నీవు కానకుండా లాలూచీ పడలేదు, నేనన్నది ఇదే సుమా అని దాచకుండా అప్పుడన్న మాటలే మరలా చెప్పింది. ఆమె చిత్తశుద్ధిని భర్త దగ్గర ఱుజువు చేయటానికే కవి అలా చెప్పించాడనిపిస్తుంది. మొత్తం మీద పద్యమొకటే అయినా మొదట చదివినపుడు కలిగే అనుభూతివేరు. తరువాత కలిగేది వేరు. సన్నివేశాన్నిబట్టి రసానుభూతి కలుగుతుంది.

  ఇలాంటిదే మరొకటుంది. ఘనతర కోపవేగమున అని ఒక పద్యం. ఇది కనుగొని కోపవేగమున అనే పద్యానికి ప్రతిబింబం. అదీ చంపకమే. ఇదీ చంపకమే. దాని ఎత్తుగడా దీని ఎత్తుగడా ఒకటే. కొన్ని పదాలూ సమాసాలూ అలాగే దొర్లాయి. భావం కూడా చాలా వరకు సరిపోతుంది. రెండూ కీచకుణ్ణి చూచి భీముడికి కలిగిన ఆవేశాన్ని వర్ణిస్తాయి. అయితే కనుగొని కోపవేగమున అనే మొదటి పద్యం సైరంధ్రిని అవమానిస్తున్న కీచకుణ్ణి చూచినప్పుడు కలిగిన కోపాన్ని ఆవిష్కరిస్తుంది. అంచేత దానిలో ఉండే సమాసాడంబరమూ రచనా వేగమూ ఈ పద్యంలో చూపలేదు కవి. ఇది కీచకుడి మీద చేయి చేసుకొనే సందర్భంలో చెప్పింది. తన భార్య నవమానిస్తున్నప్పుడు పొందిన ఆగ్రహమప్పటికి చల్లారింది. ఇప్పుడు కేవలం తత్ఫలితంగా వాణ్ణి చంపే ప్రయత్నమే. కనుకనే పద్యం కూడా అంత ఉదృతంగా కాక అంత సౌమ్యంగా కాకుండా సాగిపోయింది. రసానుభూతిలో ఇదొక వైచిత్రి.

  ఇంకొకటి కూడా దీనిలాంటిదే కనిపిస్తుంది. సింగంబున్న గుహానికేత మునకున్ అని పద్యం. ఇది కీచకుడు భీముడు మారువేషంలో ఉండి నర్తనశాలకు వచ్చినపుడు చెప్పింది. దీనికి ప్రతిబింబ ప్రాయంగా సింగం బాకటితో గుహాంతర మునన్ అని తరువాత రాబోతుంది. అది బృహన్నలా వేషంలో ఉన్న అర్జునుడు శత్రుసైన్యం మీద లంఘించేటపుడు చెప్పిన పద్యం. రెండింటిలో పదాలూ భావాలూ చాలావరకొక్కటే. ఒకటి కీచకుడు చావటానికి వచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తే మరొకటి అర్జునుడు చంపటానికి పూనుకొన్న దృశ్యాన్ని చూపుతుంది. కనుకనే మొదటిది కొంత శిధిలంగా నడిస్తే రెండవది ఆటోపంగా సాగుతుంది. రసభేదాన్ని బట్టి ఏర్పడ్డ ఈ రచనావైచిత్రి పాఠకుడికెంతో గొప్ప అనుభూతి ప్రసాదించకపోదు.

Page 234

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు