సోమయాజి రసాభ్యుదయము
సాహిత్యానికి రసమే ప్రాణం. ఆ మాటకు వస్తే ప్రతికళకూ అదే. అయితే అన్నికళల స్వరూపమూ సాహిత్యంలోనే కలిసివస్తుంది. కాబట్టి దాని సర్వస్వమూ రసమే అనుకోవచ్చు. దీనికి తార్కాణం మనకు లోక వ్యవహారంలోనే కనిపిస్తుంది. ఒక కావ్యానికి విలువకట్టాలంటే అది రసవంతమా కాదా అని అడుగుతాము. కావ్య తత్త్వాన్ని బాగా ఆకళించుకొన్న వాడెవడైనా ఉంటే వాణ్ణి రసికుడని రసజ్ఞుడని పేర్కొంటాము. ఇది కావ్య విషయం. ఇక శాస్త్రమైతే బాహ్యమైన శబ్దం దగ్గరి నుంచి కావ్య స్వరూపం అదా ఇదా అని మీమాంస చేస్తూ వచ్చి వచ్చి చివరకు రసధ్వనితో సమాప్త మయింది. దీనికి తోడు మహాకవుల ధోరణి పరిశీలించి చూచినా వారికీ ముఖ్యంగా ఈ రసపోషణపైనే మొగ్గున్నట్టు బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రసాన్ని కావ్యానికి ప్రధానంగా చేసి మిగతా రసభావాల నన్నింటినీ యధోచితంగా దాని కంగభూతంగా చేసి పర్ణిస్తూ వచ్చారు. దీన్నిబట్టి రసమే కావ్యార్ధమని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
సంస్కృతంలో కాళిదాసాదుల తరువాత మన తెలుగు కపులీ రహస్యాన్ని చక్కగా గ్రహించారు. ఆది కవి నన్నయ భట్టారకులే దీనికి గట్టి పునాది వేశారు. సా వా గ్యా రసవృత్తిః, సాధ్యోహి రసో యథాయథం కవిభిః అని చాటారాయన. కావ్యమంటే రమ్యమైన అర్థాన్ని చెప్పే వాక్కు ఆ వాక్కు రసవంతమైనది కావాలి. అలాంటి రసాన్ని పోషించటమే కవి అయినవాడికి కర్తవ్యమని సన్నయ్య ఇచ్చిన సందేశం. మహోన్నతమైన ఈ సందేశాన్ని అందుకొనే మన భాషలో మహాకవులనిపించుకొన్న వారంతా అద్భుతమైన కావ్యాలను సృష్టిస్తూ వచ్చారు. తెలుగు కావ్యాలనగానే స్మరణకు వచ్చే మను చరిత్ర వసుచరిత్రలను తరచి చూస్తేనే మనకీ విషయం దాఖలా అవుతుంది. మనుసంభవ మరయ రస సమంచిత కథలన్ అంటాడు పెద్దన. మరి భట్టుమూర్తి సాహిత్య రహస్యాన్ని గూర్చి ప్రస్తావిస్తూ లోచనాంజన రస ప్రోన్మేషముల్ అని చాటుతాడు. మొత్తం మీద ఆది కవి నన్నయ్య భట్టు వేసిన వరవడినే ప్రబంధకవుల వరకూ అందరూ పాటిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరూ రస దృష్టితోనే కావ్య సృష్టి చేస్తారే గాని మరొక దృష్టితో చేయలేదు.
Page 224