అయితే అందరూ ఒక ఎత్తు. తిక్కన సోమయాజి ఒక ఎత్తు. కావ్య పరమార్థమైన ఈ రసాన్ని పట్టుకొని దాన్ని విశ్వతోముఖంగా చిత్రించిన వాడీ మహాకవి. కనుకనే ఆయన కవిబ్రహ్మ అయినాడు. నానావిధ రసబంధురమైన ఒక నవీన ప్రపంచాన్నే నిర్మించాడాయన. ఆ నిర్మాణంలో ఆయన కాయనే సాటి. ఆయా సందర్భాల కనుగుణంగా అన్ని రసభావాలనూ ఒప్పించటమే మహాకవి కుండవలసిన ప్రధాన లక్షణమని తిక్కన అభిప్రాయం. అంచేతనే భారతకథ నందుకొనే అవతారికలోనే హృదయాహ్లాది చతుర్థ మూర్జిత కథోపేతంబు, నానారసాభ్యుదయోల్లాసి అని ముక్త కంఠంతో చాటిస్తాడు. హృదయాహ్లాద మందజేయటమే కావ్యప్రయోజనం. అది దేనివల్ల చెందుతుంది. కథా వస్తువు బలంగా ఉన్నప్పుడే. వస్తువులో పటుత్వమెలా ఏర్పడుతుంది. నానా రసాలనూ చక్కగా పోషించినపుడేనని సమాధానం. హృదయాహ్లాద మనే మాటే ఆంధ్రావళి మోదముం బొరయు నట్లుగ అనేచోట కూడా మరలా ధ్వనిస్తున్నది. అంతేకాదు హరి హర నాథుడు కలలో సాక్షాత్కరించినపుడు కూడా ఆస్వరూపాన్ని చూస్తూంటే తిక్కనకు రసమే సాక్షాత్కరించిన ట్టనిపించి ఉండవచ్చు. రసోవై సః అన్నారు గదా పరమేశ్వరుణ్ణి. కనుకనే కరుణా రసము వొంగి తొరగెడు చాడ్పున శశిరేఖ నమృతంబు జాలువార అని ఆయన మూర్తిలో మొదట రసోల్బణతనే దర్శించ గలిగాడు. పైగా తాను హరి హరనాథుని కీర్తిస్తూ చాటువుగా చెప్పిన సంస్కృత శ్లోకంలో కూడా కిం కాల కూటః కిము నా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. నీకు హాలా హల రసమిష్టమా లేక యశోద స్తన్య మిష్టమా అని ప్రశ్నిస్తాడు. దీన్నిబట్టి తిక్కన దృష్టి అంతా రససృష్టి మీదనే ఉన్నట్టు మనకవగతమవుతుంది. ఇది కవి దృష్టిని బట్టి చేసిన విమర్శ. పోతే మిగతా కవుల మాటలను బట్టి చూచినా తిక్కన దృష్టి ఎలాంటిదో మనం గ్రహించవచ్చు. తిక్కనను కీర్తించిన ప్రతి మహాకవీ ప్రధానంగా ఆయనకు గల రసపోషణ కౌశలాన్నే కీర్తిస్తూ వచ్చాడు. శ్రీనాథుని వంటి కవిసార్వభౌముడు చెప్పిన మాట ఇది. వాక్రుత్తు తిక్క యజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు. తిక్కన అనగానే శ్రీనాధునికి రసాభ్యుచిత మనే గుణమే జ్ఞాపకం వచ్చింది. ఆయా రాసాల కనుగుణంగా సన్నివేశ కల్పన చేయటంలో తిక్కనను మించిన శిల్పి మరొకడు లేడని సార్వభౌముని అనుశాసనం. శ్రీనాధుడు ప్రత్యక్షంగా చేసిన ఈ వ్యాఖ్యనే అంతకు ముందు నాచన
Page 225