మాటాడుతుంటే బ్రాహ్మణి ఆడది గనుక చేతులు తిప్పుతూ మాటలు సాగదీస్తూ మాటాడటం కనిపిస్తుంది.
ఇంకా లోతుకు దిగి చూస్తే ఆలంకారికులు వర్ణించిన చూర్ణిక వృత్తగంధి, ఉత్కలికా ప్రాయము అనే గద్యలక్షణాలన్నీ మూర్తీభవించి కనిపిస్తాయి సూరి వాక్య రచనలో. మగధ దేశమందు మందారవతి యను వనము గలదు. ఇది ఆలవెలది పాదం. నిన్న యున్నవాడు నేడు లేడు. ఇదీ అంతే. యతికూడా సరిపోతుంది. డాయబోయి పట్టుకొని గనయమున గట్టుగొని మూపుమీద బెట్టుకొని, మెఱపు మెఱసిన తెఱగున నుఱికి యురమ్ము గ్రుమ్మ. శాత శిఖంబులగు నఖంబు లూడకొన చరచినన్ దొరుగు కీలాల జాలంబు నగశృంగ నిస్సరజ్ఝరీ పూరంబు ననుకరింప. ఇందులో మొదటివి వృత్తగంధికైతే ఇవి ఉత్కలికా ప్రాయాని కుదాహరణలు. పోతే అక్కడక్కడ పసరముల దొక్కలు వెదకుట మనకార్యము. అది మాని ఈ విచారమేల. ఇలాంటిదెంతైనా ఉంది చూర్ణికమనే రచన కుదాహరణం. అసలా మాటకు వస్తే ఇవి మూడూ కూడా కాదు. గేయగంధి అని మరొక విభాగం కూడా చేయవలసి ఉంటుంది సూరిగారి రచనలో. ఆయన ఎక్కడ ఏ వాక్యం రచించినా అది శ్రుతి సుభగం. లయ బద్ధం. ఎక్కడా చూడబోము మనమీ మహి. అటు సంస్కృతంలో చూడమిటు తెలుగులో చూడుము. ఒక వాక్యం తరువాత ఒకటి ఎలా సాగాలో ఏ కొలతలో సాగాలో ఏ ఆరోహణా అవరోహణ మార్గంలోనే అది ఆయనకే విదితం. మొత్తం మీద ఒక గంగా స్రవంతి లాగా సాగుతుందా రచన. ఆ ప్రవాహానికేది తోడ్పడుతుందో ఆ మాటే వాడుతాడు. ఎక్కడ ఉంటే అది అనుకూలమో అక్కడే ప్రయోగిస్తాడు. గుణవంతులలో ప్రథమ గణ్యుడు గాని కొడుకును గన్న తల్లి కంటే వేరు గొడ్రాలు గలదా. గుణవంతుడైన పుత్రుడొకడు చాలును. మూర్ఖులు నూరుగుర వలన ఫలమేమి. ఇందులో ప్రతిమాటకూ ఎన్నో పర్యాయ పదాలున్నాయి. అవి ఎక్కడ వాడినా వాడవచ్చు. కాని వాడిచూడండి మీకే తెలుస్తుంది.
పదాలు ప్రయోగించటంలో నైతే ఇక ఆ జాగ్రత్త చెప్పలేము. శబ్ద శుద్ధి అనేది నన్నయ తరువాత చిన్నయలాగా పాటించిన రచయిత లేడు. ఒక పదానికి ప్రామాణికమైన అర్ధమేదో నిఘంటువు చెప్పినట్టు చెబుతుందాయన రచన. దైవ గతి విపరీతమైనపుడు, విపరీతమంటే ఎక్కువని గాదు, తారుమారు. ఈతని సంగతి నాకు సరిపడదు. సంగతి అంతే వృత్తాంతమని గాదు. సాంగత్యం. మూఢులీ
Page 220