పారిజాతంలోని పరిమళం
పరిమళము సెడదు - వాడదు - పరువము దప్పదు పరాగభర భరితంబై నిరతము జగదేక మనోహర మగు నిక్కుసుమ రాజ మంబుజ వదనా
ఇది పారిజాత కుసుమాన్ని వర్ణిస్తూ నారద మహర్షి రుక్మిణీదేవితో అన్నమాటలు. చూడబోతే నాకివి నారదుడన్నమాటలుగా కనిపించవు. నారదుడి భూమికలో మహాకవి నంది తిమ్మన్న తన కావ్యాన్ని గురించే మనకు వర్ణించి చెబుతున్నాడా అనిపిస్తుంది.
పారిజాతం మాదిరి పారిజాతాపహరణ కావ్యం కూడా పరిమళం చెడనిదే. శతాబ్దాలు గడిచినా వాడిపోదు సరిగదా నవనవోన్మేషంగానే ప్రకాశిస్తుంది. పరాగపుంజంలాగా ఎన్నో కళారహస్యాలందులో ఇమిడిఉన్నాయి. సకల గుణభార భరిత మవటంచేత అది సాహితీ రసజ్ఞులైన పెద్దలందరికీ అన్ని కాలాల్లోనూ మనోజ్ఞంగానే భాసిస్తున్నది.
మరొక విశేషం కూడా ఉంది ఇందులో. పుష్పమనేది కంటికి కనిపిస్తుంది. అందులో పరిమళం అలా కనిపించదు. కనిపించే ఈ పుష్పం కనిపించని ఆ పరిమళాన్ని ఆధారంచేసుకొని నలుదెసలా వ్యాపిస్తుంది. అఘ్రాణించే కొద్దీ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. దానితో ఒక అలౌకికమైన తన్మయత్వాన్ని అందుకొంటాడు మానవుడు.
అలాగే శబ్దార్ధ మయమైన కావ్యం కూడా మనచేతిలో ఉన్న ఒక పుష్పం లాంటిది. పుష్పాన్ని సౌరభం లాగా కావ్య శరీరానన్నంతా వ్యాపించి ఒకానొక కావ్య ధ్వనిమన భావనకు తగులుతుంది. బాగా లోతుకు దిగి మననం చేసే కొద్ది సహృదయుడి కొక లోకోత్తరమైన అనుభూతినది ప్రసాదిస్తుంది. దానితో పుష్పం మాదిరే కావ్యం కూడా చరితార్థమవుతుంది.
ఇంత స్వారస్య ముంది ఆ మాటలలో. మహాకవుల మాటలెప్పుడూ పేలవం కావు. అవి బాగా గురి చూచి వదలిన బాణాల లాంటివి. వారెంతటి కళాస్రష్టలో అంత విమర్శకులు. విమర్శకులు కాకుంటే భావించలేరు. భావించకుంటే వర్ణించలేరు.
Page 206