కనుకనే వారి వర్ణనల్లో అన్యాపదేశంగా కొన్ని అమూల్యమైన రచనా రహస్యాలు మనకు స్పురిస్తుంటాయి.
అసలిది కృష్ణదేవరాయల దాంపత్య జీవిత రహస్యమే తిమ్మన వ్యంగ్యంగా బయట పెట్టాడని చెబుతారు విమర్శకులు. అదీ కొంత నిజమేనని తోస్తోంది. సత్యభామా భోగసక్తి నాడును నేడు - అని కృష్ణునికీ కృష్ణరాయలకూ అభేదాన్ని కల్పించి పీఠికలోనే వర్ణిస్తాడు కవి. అంతేగాక ప్రధమాశ్వాసం చివరి పద్యంలో మరికొంత ధ్వనింపచేస్తాడు. దాన్ని. ప్రతి వర్ష వసంతోత్సవ కుతుకాగత సుకవి నికర గుంభిత కావ్య స్మృతి రోమాంచ విశంకిత చతురాంతఃపురవధూ ప్రసాదన రసికా. ప్రతి సంవత్సరమూ వసంతోత్సవాలు జరిగేవట విజయనగరంలో. ఆ ఉత్సవాల్లో పాల్గొనటాని కెందరో కవీశ్వరులు వచ్చేవారట. వారందరూ పద్యాలల్లి కృష్ణరాయలను ప్రశంసిస్తుంటే ఆయన నిలువెల్లా పులకించిపోయేవాడట. ఆ పులకిత గాత్రంలో అతడంతఃపురంలో అడుగుపెట్టగానే రాణులంతా ఎవరికి వారాయన గారిని శంకించి అలిగి కూచునేవారట. వారి అలకతీర్చటానికాయన వారి పాదాల మీద వాలేవాడట.
చూడండి. రాయలవారిని వర్ణించటానికెన్నో విశేషణాలుండగా ఏవం విధ విశేషణ విశిష్టంగా ఎందుకు వర్ణించాలి తిమ్మన. కావ్య రసాస్వాదనమనే వ్యాజంతో వారి దాంపత్య జీవిత రహస్య భేదనానికే కాకపోతే. కృతిభర్త దాంపత్యం లోని ఈ మధుర సన్నివేశాన్ని బయటపెట్టటానికే కృతి నాయకుడైన శ్రీకృష్ణుని శృంగార చరిత్ర అంతా.
ఆ మాటకు వస్తే కృతి భర్త ఏమిటి? కృతి నాయకుడేమిటి? కవి ఏది వర్ణించినా అది లోకుల కోసమే. లోకోత్తరుడైన శ్రీకృష్ణుని జీవితాన్ని నెపంగా పెట్టుకొని లోకుల దాంపత్య జీవితమెలా ఉండాలో సంసారంలో ఎలాంటి సంస్కారంతో నడుచుకోవాలో స్త్రీ పురుషులందరికీ నిర్దేశిస్తున్నాడు మహాకవి.
కృష్ణుడు పదహారు వేలమంది కన్యలను వివాహమాడాడు. ఎలాంటి పరిస్థితిలో. నరకాసురుడు రాక్షసంగా వారిని చెరబెడితే తాను విడిపించాడు. అందుకెంతో కృతజ్ఞతతో వారందరూ తన్నే వరునిగా కోరుకొన్నారు. పైగా నారదునిలాంటి పెద్దమనిషి అనుమతి ఇచ్చాడు. అందుకోసం ఎంత పెద్ద సంఖ్య అయినా భరించగలిగాడట.
Page 207