ఆత్మస్వరూపమైన ఆ ఈశ్వర శక్తే కరావలంబమిచ్చి అతణ్ణి తన జీవితమార్గంలో నడిపిస్తూ పోతుంది. అదే ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతూ పోతుంది. సాధకుడి ప్రతి కదలికా నడవడీ ఈశ్వర చైతన్యంతో నిండిపోయి తద్భిన్నమైన ప్రాపంచిక వృత్తులన్ని ఎప్పటికప్పుడందులోనే లయమై పోతుంటాయి. అప్పుడిక తానూ తాను చూచే ఈ భౌతిక ప్రపంచమూ - రెండూ తన స్వరూపంగానే భాసిస్తాయి సాధకుడికి. వాడిక సాధకుడు కాదు, సిద్ధుడే.
సిద్ధుడీశ్వరుడి స్థాయినే అందుకొంటాడు కాబట్టి ఈశ్వరశక్తి వాడికీ వశ వర్తిని అయి తీరుతుంది. దాని బలంతో ఎన్నో మహిమలు కూడ ప్రదర్శించగలడతడు. అవి ఆ జీవుడుగాక ఆ ఉపాధిలో ఉన్న ఈశ్వరుడే ప్రదర్శిస్తూన్నాడను కోవాలి మనం. జీవుడూ ఈశ్వరుడూ అని ఇక తేడా లేదు. జీవుడీశ్వరుడే గనుక అతడు చేసే ప్రతి ఆలోచనా ఈశ్వరుడి ఆలోచనే. ప్రతిమాటా ఈశ్వరుడి మాటే. ప్రతిచేష్టా ఈశ్వరుడి చేస్తే అలాటి తాదాత్మ్యం సిద్ధించినప్పుడే అది పరిపూర్ణమైన సిద్ధి మానవుడికి. దానితో ఒక క్రొత్త జీవితము ఒక క్రొత్త దృష్టి, క్రొత్తశక్తీ వాడొక సరిక్రొత్తగా వ్యక్తిగా మారి కనిపిస్తాడు లోకానికి.
అసలా ఈశ్వరుడే ఇలాటి సిద్ధపురుషులను గురించి ఒకమాట సెలవిచ్చాడు. నేనే తానుగా భావించి సేవించే మహాత్ముల విషయంలో నేనే వారికి చెవినై శబ్దాలు వింటాను. కన్నై రూపాలు చూస్తాను. నాలికనై మాటాడుతాను. వాని చేతులయి పనులు చేస్తాను. పాదాలై సంచరిస్తాను. ఈశ్వర తాదాత్మ్వసిద్ధి కింత కన్నా తార్కాణ మక్కరలేదు. జీవుడు తనకు తాను లేకుండాపోయి, తనకి జగత్తుకూడా లేకుండా పోయిన దశ ఇది. లేకపోటమంటే వాటితో సంబంధమే పెట్టుకోడనీ, వ్యవహరించడడనీ కాదు. వ్యవహరిస్తాడు జీవన్ముక్తుడు. అలా వ్యవహరిస్తున్నా ఎవరితో వ్యవహరిస్తున్నాడో దేనితో వ్యవహరిస్తున్నాడో, అది అది అని చూడక అంతా తన చైతన్యచ్ఛాయ అనే అంతర్దృష్టితో చూస్తూ పోతాడు. అంటే లౌకీకాన్ని అలౌకిక దృష్టితో చూస్తాడని అర్థం. అప్పుడు లౌకిక మలౌకిక మనే విభాగం మాసిపోయి లౌకికమంతా అలౌకికమే అయిపోతుంది. కాబట్టి ద్వైత ప్రపంచంతో వ్యవహరిస్తున్నా అది అద్వైతానుభవమే.
Page 167