కేవలం జన్మను మాత్రమే ఇచ్చారంటాడు మహాకవి. ప్రజల నుంచి వారు పన్నులు వసూలు చేసినా ప్రజానా మేవ భూత్యర్థం. అది వారికిను మిక్కిలిగా వినియోగించటానికే సుమా అని వర్ణిస్తాడు కూడా. అసలు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః అని భారతీయుల మహోన్నతమైన ఆకాంక్ష. పాలకులు న్యాయసమ్మతమైన మార్గంలో పరిపాలన చేయాలని పాలితులైన ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించాలని ఈ ఇరువురి సత్సంబంధమే పురుషార్థ సాధనమనీ భావించారంటే ఎంత ఉదాత్తమైన దృక్పథమో చూడండి మన వారిది. దేశమేలే ప్రభువులు, వారికి సహకరించే మేధావులు వీరి ప్రవర్తననుబట్టే ఉంటుంది దేశప్రజల జీవితాభ్యుదయం. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః సరస్వతీ శ్రుత మహతాం మహీయతామ్. ప్రజాహితం కోసంమే రాజులు ప్రయత్నించాలట. విద్యావంతుల విద్యకు దేశంలో గౌరవముండాలట. కాళిదాసు ముక్త కంఠంతో చాటిన సత్యమిది. ఉత్తమమైన సంస్కృతి ఉత్తమమైన పరిపాలనా ఫలమే.
అయితే ఒకమాట. మన సంస్కృతి ఎంత గొప్పదైనా చారిత్రకంగా చూస్తే అప్పుడప్పుడు కొన్ని ఒడుదుడుకులకు గురి అవుతూనే వచ్చింది. వస్తున్నది. వర్ణ విభేదం న్యూనాధికతలను రెచ్చగొట్టి పరస్సర సంఘర్షణలకు కూడా దారి తీసింది. మత ధర్మానుష్ఠానం వెర్రితలలు వేసి మూఢాచారంగా పరిణమించింది. సగుణోపాసన విగ్రహారాధనతో నిలవక అన్యదేవతా దూషణ అన్యమత ద్వేషణ సాగిస్తూ వచ్చింది. అంతేగాక కనపడని దేవతల మెప్పుకోసం కనపడే ప్రాణులను బలి ఇస్తూ అవి పవిత్రమైన యజ్ఞాలుగా భావించేదాకా పోయింది. ఇవన్నీ మన భారతీయ సంస్కృతిలో కొన్ని విడ్డూరమైన విషయాలే. ధాన్యం లోపొల్లులాగా అవాంఛనీయమైన అంశాలే. వీటిని నివారించి మన జీవిత విధానాన్ని సరిదిద్దటానికి మన సంస్కృతిని కాపాడటానికి గతంలో ఎంతోగానో ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. కాని ఆసించినంత ఫలితం లభించటం లేదు. ఏమిటీ వైపరీత్యానికి కారణం. ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడలేకపోవటం. భిన్నత్వమనేది ప్రకృతి సిద్ధం. అది సృష్టిలోనే ఉందసలు. ప్రతిరంగంలోనూ చోటుచేసుకొని ఉంది. దాన్ని భౌతికంగా ఎవరూ మార్చలేరు. సహజమైన తత్త్వాన్ని ఎలా మార్చగలం. నీరు పల్లానికి ప్రవహించకుండా చేయగలమా. నిప్పు కాల్చకుండా చూడగలమా.
Page 158