అయితే మరేమిటి మనం చేయవలసింది. భౌతికంగా సృష్టిలో అనేకత్వం పాదుకొని ఉంటే వైజ్ఞానికంగా దానిలో ఏకత్వాన్ని దర్శించటం. దర్శించి తదనుగుణంగా నడుచుకోటమే మానవుడి కర్తవ్యం. భౌతికం ప్రకృతి అయితే వైజ్ఞానికం సంస్కృతి. ప్రకృతి అనేకత్వాన్ని సృష్టిస్తే సంస్కృతి ఏకత్వాన్ని దర్శిస్తుంది. ప్రతి ఒక్క మతస్థుడూ దర్శించాలీ సత్యం. ఏ ఒక్క దేశస్థుడో, మతస్థుడో దర్శిస్తే సరిపోదు. అలా సర్వులూ దర్వించి వ్యవహరించిన నాడే అది సామరస్యంతో కూడిన సంస్కృతి. లేకుంటే వికృతే. ఇలాటి వికృతి లేని సంస్కృతిని సాధించటమే ఎవరైనా లోకానికి చేసే ఉపకృతి.
నవరాత్రాలు
1. పండగలూ పబ్బాలంటే మానవులకెంతో సరదా. ఆబాలగోపాలమూ వాటినెంతో ఉత్సాహంగా జరుపుకొంటుంటారు. శ్రీరామనవమి నుంచి శివరాత్రి వరకూ సంవత్సరం పొడుగునా పండగలే. పండగ అనగానే బంధుమిత్రాదులు నలుగురూ కలుసుకొని విందులతో, వినోదాలతో కాలక్షేపం చేయటమనే మన భావన. పైకి కనిపించే వ్యవహారం మిదే అయినా ఆంతర్యంలో చాలా విశేషముంది. ప్రతి పండగా ఏదో ఒక దేవతకు సంబంధించే ఉంటుంది. దేవతలంటేవారు అమర్యులు. మానవులమైన మనమంతా మర్త్యులం. జన్మమృత్యు జరా వ్యాధులతో నిత్యమూ సతమతమవుతున్నాము. వీటి బారి నుంచి తప్పించుకొని బయటపడాలంటే అవి లేని దేవతామూర్తుల నారాధించాలి. యద్భావ స్తద్భవతి అన్నారు. దేనినారాధిస్తే దానితో తాదాత్మ్యం సిద్ధిస్తుంది. దేవతల నారాధిస్తే వారి లోని దివ్యగుణాలు మనలో చోటుచేసుకొంటాయి. నిరంతారాభ్యాసం వల్ల మర్త్యవాసనలు పూర్తిగా తొలగిపోయి ఈ మర్త్యుడు చివర కమర్త్యుడయ్యే అవకాశముంది. అదే మానవజీవితానికి పరిపూర్ణత. ఆలోచిస్తే ఇంత ఉన్నదీ పండగలలోని అంతరార్థం.
2. మనం చేసుకొనే పండగలన్నిటిలో తలమానికమైన వీ దేవీ నవరాత్రోత్సవాలు. శరన్నవరాత్రాలని కూడా పేర్కొంటారు వీటిని. శరత్తంటే శరదృతువనే గాక సంవత్సరమని కూడా అర్థమే. జీవేమ శరద శృతమన్నారు.
Page 159