#


Index

చిత్రతరంగిణి

సంవత్సరం వసంతంతో మొదలవుతుందని ఒక మాట. శరత్తుతో నని ఒక మాట. ఇవి రెండూ కూడా మనలను రోగాల పాలు చేసే ఋతువులట. వాటిని పోగొట్టు కోవాలంటే ఆ యాదేవతలను సేవించటం మానవుడి ధర్మమని దేవీ భాగవతం మనకు చాటుతున్నది.

  3. పైగా ఆరు ఋతువులలోనూ శరదృతువుకొక విశిష్టత ఉంది. అంతకు ముందే వర్షాలు బాగా పడిఉంటాయి కాబట్టి భూములు బాగా పండి పంట చేతికి వస్తుంది. దానితోపాటు పశువులకు గ్రాసంకూడా లభించి పాడి కూడా పుష్కలంగా ఉంటుంది. వర్ష బాధ లేదు కాబట్టి రాజులకు దిగ్విజయ యాత్ర చేయటానికి కూడా అనుకూలమైన సమయం. లాక్షణకింగా చెబితే, తత్ర శ్రీ ర్విజయో భూతిః, అన్నట్టు మనమప్పుడు తలపెట్టిన ప్రతి మంచి పనీ విజయవంత మవుతుందని భావం. మరి వాగులూ, వంకలూ, కాలుష్యం తొలగి బాగా ప్రసన్నంగా కనిపించేది కూడా ఈ శరదృతువులోనే. ఇది కూడా లాక్షణికంగా చూస్తే మానవుడి మనస్సుకు పట్టిన రజస్తమో మాలిన్యం పోయి ప్రసన్నతా గుణమేర్పడతుందని అభిప్రాయం. ఇలా మనభావంలోనూ బాహ్యంలోనూ ఎంతో శుద్ధినీ సమృద్ధినీ ప్రసాదించేదీ శరత్కాలం.

  4. ఇలాంటి పవిత్రమైన వాతావరణంలో జరుపుకొంటున్నాము మన మీ నవరాత్రోత్సవాలను. మిగతా పండగలన్నీ ఒక ఎత్తైతే ఈ నవరాత్రోత్సవాలొక ఎత్తని చెప్పాము, కారణం. ఇవి దేవీ నవరాత్రాలు గనుకనే. మిగతావన్నీ ఆయా దేవతలవైతే ఇవి ఆ దేవతలందరికీ పరాదేవత ఎవరో ఆవిడకు చెందినవి. ఎక్కడున్నారీ దేవతలని ప్రశ్నించరాదు. ప్రకృతి శక్తులే దేవతలంటే. ఈ శక్తులన్నిటికీ మూలశక్తి ఏదున్నదో అదే పరాశక్తి, పరాదేవత. అది సహజంగా అచేతన. స్వతంత్రమైన ఉనికి లేదు దానికి. కనుక స్వతస్సిద్ధమైన పరమాత్మ చైతన్యాన్ని ఆశ్రయించి ఉంటుందెప్పుడూ. జడాహం తస్యసాన్నిధ్యా త్ప్ర భవామి సచేతనా - అని దేవి స్వయంగానే చాటుతున్నది లోకానికి. అసలు చిదగ్ని కుండ సంభూతా అని వర్ణించటంలోనే మనకర్ధ మవుతుందది పరమాత్మ నాశ్రయించి ఉందని.

Page 160

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు