#


Index

చిత్రతరంగిణి

అలాగే ధర్మపురుషార్థంలోనే గాక బ్రహ్మపురుషార్ధంలో కూడా గొప్ప సమన్వయమే సాధించారు భారతీయులు. కొందరీశ్వరుడు సగుణమని ఆరాధిస్తే కొందరు నిర్గుణమని భావిస్తారు. సగుణమనేక దేవతోపాసనకు దారి తీస్తే నిర్గుణం కేవలమాత్మోపాసన. రెంటికీ వైరుధ్యం లేదు. నిర్గుణమైన ఆత్మచైతన్యమే జీవ జగదీశ్వర రూపంగా భాసిస్తున్నది. ఇది కేవలం వ్యావహారికమే. దీని నాలంబనం చేసుకొని మానవుడెప్పటికైనా దానినందు కొని తరించగలడని సమర్థించారు తత్త్వజ్ఞులు. దీనివల్ల బాహ్యమైన విగ్రహారాధన దగ్గరినుంచీ అంతరమైన ధారణా ధ్యానసమాధుల వరకూ అన్ని సాధన మార్గాలకు సమన్వయం చేసి చూపారు.

  మరి ఇలాంటి విజ్ఞాన సంపద కొక్క పురుషుడే గాడు వారసుడు. స్త్రీకి కూడా వారితోపాటు హక్కున్నదని చాటారు. వేదకాలంలోనే గార్గీ సులభా మైత్రేయీల లాంటి మహిళలెందరో ఎన్నో విద్యలలో ప్రవీణలయినట్టు దాఖలాలున్నాయి. వాఙ్మయంలో. స్త్రీ పుమా నిత్యనాసైషా, వృత్తంహి మహితం సతాం. స్త్రీ పురుషు డనేది కేవలం లింగ భేదమే. శ్రుత శీలవృత్తాదులలో ఇరువురికి ఎలాటి భేదమూ చూడరాదన్నాడు మహాకవి కాళిదాసు. న స్త్రీ స్వాతంత్య్ర్య మర్హతి అని మనువు వాక్రుచ్చాడంటే అది వారి రక్షణ కోసం చెప్పిన మాట. విద్యావినయాది శిక్షణ కోసం కాదు. ఆ మనువే యత్ర నార్యస్తు పూజ్యంతే. స్త్రీల కెక్కడ పూజ్యత ఉంటుందో అదే సంస్కారవంతమైన జాతి అని చాటాడు లోకానికి. ఇంతెందుకు ధర్మార్థ, కామమోక్షాలు నాలుగింటిని మానవజీవితానికి లక్ష్యాలుగా పేర్కోన్నారంటే అవి కేవలం పురుషులకే ననా వారి ఉద్దేశం? కాదు, స్త్రీలకు కూడా. పురుషార్థంలో పురుష అనే మాటకు మానవుడని అర్థం. మగవాడని కాదు.

  పోతే ఇలాటి ఉదాత్తమైన జీవిత లక్ష్యాలను మానవులందరూ సాధించాలంటే అది దేశం సుఖశాంతులతో ఉన్నప్పుడే సాధ్యం. అశాంతీ సంక్షోభమూ రాజ్యం చేస్తుంటే దేనికీనోచుకోలేదు జాతి. ప్రజానురంజన మొక్కటే లక్ష్యం కావాలి పాలకులకు. రాజాప్రజారంజన లబ్ధవర్ణః అంటాడు కాళిదాసు. ప్రజానాం వినయాధానా ద్రక్షణా ద్భరణాదపి - సపితా పితర స్తాసాం కేవలం జన్మ హేతవః ప్రజలకు తగిన శిక్షణ ఇవ్వటంలోనూ, రక్షణ కల్పించటంలోనూ రాజేవారికి తండ్రి అట. మరి వారి తండ్రులో

Page 157

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు