వరకే గాదు. ఆముష్మికిమైన దృష్టి ఒకటి ప్రతి విద్యలోనూ ప్రతి కళలోనూ అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంటుంది. అసతో మా సద్గమయ అన్నట్టు ఈ ఐహికం ద్వారా ఆముష్మికమైన ప్రయోజనాన్ని సాధించాలనే మనవాళ్ళ సంకల్పం. అంతేకాదు ఈ ఐహికంలో కూడా ప్రతి ఒక్కరంగంలోనూ సమన్వయమనేది ఒక ధ్యేయంగా పెట్టుకొన్నారు. మనలో ఎన్నో మతాలుండవచ్చు. ధర్మాలుండవచ్చు. అసలు మతాన్ని ధర్మమనే పేర్కొంటారు మన పూర్వులు. ఇవి పరస్పర వైషమ్యానికి గాక సహజీవనానికి దారి తీయాలని వారి సిద్ధాంతం. ఇంతెందుకు. వర్ణాశ్రమ ధర్మాలే ఉన్నాయి. వాటిలో పైకి ఎన్ని భేదాలు కనిపిస్తున్నా అవి మానవుల అన్యోన్యతకు విఘాతం కలిగించరాదు. మహాభారతం లోకానికిలా చాటుచున్నది. ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము నీ మనంబున కగు నీ వొరుల కవి సేయ కునికియె పరాయణము సకల ధర్మపధముల కెల్లన్. ఒకరు నీకేది చేస్తే అప్రియంగా భావిస్తావో నీవు ఒకరి కలాటి పని ఎప్పుడూ చేయరాదట. ఎంత గొప్ప మాట. ఇంతకన్నా వసుధైక కుటంబ భావన ఏముంది. అసలు తోడి మానవులనే గాదు, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమంపశ్యతి యోర్జున- సుఖంవా యదివా దుఃఖమ్. నీతో పోల్చుకొని చూడు ప్రతి ఒక్క ప్రాణినీ. అప్పుడే జీవికీ హాని తలపెట్టవంటుంది గీత. ఇట్టి సమభావన ఉన్నప్పుడెన్ని మతాలుంటే నేమి. ఎన్నివర్ణాలుంటే ఏమి. భిన్నత్వంలో ఏకత్వాన్నే చూడవచ్చు.
అయితే వర్ణభేదం రానురాను గట్టిపడి అది విద్వేషానికి దారితీయలేదా అని అడగవచ్చు. అది ఆయా వ్యక్తులనుబట్టి ఉంటుంది గాని వ్యవస్థనుబట్టి కాదు. వ్యక్తి సంస్కారవంతుడైతే వాడినే వ్యవస్థ కూడా అడ్డుకోలేదు. ధర్మవ్యాధుడనే బోయ కౌశికుడనే బ్రాహ్మణుడికి సకల ధర్మాలూ ఉపదేశించినట్టుంది భారతంలో. విదురాదు లగ్రవర్ణాలలో పుట్టకపోయినా సనత్సు జాతునిలాంటి మహర్షుల వల్ల సకల విద్యలలో శిక్షణ పొందినట్టూ ఉంది. మరి యక్ష ప్రశ్నలలో కులమా, జన్మమా, విద్యా, వృత్తమా ఏది వ్యక్తికి ప్రధానమని అడిగితే వృత్తమేనని జవాబిచ్చాడు ధర్మరాజు. అసలు చాతుర్వర్ణ్యమనేది గుణకర్మలను బట్టేగాని జన్మనుబట్టి అని ఎప్పుడూ చెప్పలేదు. జన్మనా జాయతే శూద్రః, సంస్కారాద్ద్విజ ఉచ్యతే అన్నారు. జన్మతో ప్రతి ఒక్కడూ శూద్రుడే. సంస్కారంతోనే ద్విజుడనిపించుకొంటున్నాడు. కాబట్టి వర్ణ విభాగమెప్పుడూ మానవుల సహజీవనానికి ప్రతిబంధకం కాదు. కారాదు కూడా.
Page 156