ఒక సత్యాన్ని చాటి చెప్పే సంకేతమని అర్థం. పైకి కనిపించే ఈ సంకేతం ద్వారా ఆ సత్యమేదో దాన్ని అన్వేషించి పట్టుకోవాలి భావుకుడు. సత్యమేమిటిక్కడ. పెనుకొండకు కుసుమగుప్త నాయకుడంటే పెద్దకొండలాటి ధైర్యమూ స్థైర్యమూ ఉన్న మానవుడని భావం. అతడు కుసుమగుప్తుడు. అంటే కుసుమ కోమలమైన సాత్త్విక స్వభావం కలవాడు. “సత్త్వాత్సంజాయతేజ్ఞాన” మన్నట్టు సత్త్వశీలురకే జ్ఞానస్వరూపిణి అయిన దేవి సాక్షాత్కరించేది. సాక్షాత్కరించి శిష్టుడైన అతణ్ణి - అతడి అనుయాయులైన పెద్దలను తన కటాక్ష వీక్షణంతో సమస్త సంపదలూ ఇచ్చి కాపాడుతున్నది. అయితే అది ఎప్పుడూ అలాగే సాగదు. అధర్మంవల్ల ధర్మం దెబ్బతింటుంది. అధర్మం మూర్తీభవించినదుష్టచిత్తుడే ఈ విష్ణువర్ధనుడు. ధార్మికులైన చాళుక్య రాజులను నిర్జించి అతడు అధార్మికంగా రాజ్యమేలుతున్నాడు. పైగా అనుచితమని కూడా చూడక తన సాంగత్యాన్నే అభిలషించాడు, దురాగ్రహంతో బలాత్కరింపబూనాడు.
అంచేత అలాంటి దుష్టుడిని అతడి దుష్ట పరివారంతో సహా రూపుమాపాలి దేవి. అసలు దేవి ఆవిర్భావమే అందులకు గదా. శిష్టరక్షణా దుష్టశిక్షణే ఆవిడ కర్తవ్యం. తన్మూలంగా ధర్మాన్ని లోకంలో తిరిగి ప్రతిష్ఠితం చేయాలావిడ. దుష్టుడిప్పుడీ విష్ణువర్ధనుడు. అతడనవసరంగా శిష్టులైన తన వారిని బాధిస్తున్నాడు. అనుచితంగా తన్నే కామించాడు. కనుక అతణ్ణి శిక్షించాలి. శిక్షించకుంటే ధర్మస్థాపన జరగదు. మరి ఎలా శిక్షించాలా దుర్మార్గుణ్ణి. అగ్నికుండంలో తాను తనవారు ప్రవేశించి ఆత్మాహుతి చేసుకోవటమా అలా ఆత్మాహుతి చేసుకుంటే అది తమ్ముతాము శిక్షించుకోటమవుతుందేగాని విపక్షులను శిక్షించటమెలా అవుతుంది. చూడబోతే. ఇది వింతగా తోస్తుంది ఈ వ్యవహారం. కాని ఇందులోనే దాగి ఉందొక గంభీరమైన భావన.
యామాసామాయా - అన్నట్టు సకల సంపత్స్వరూపిణే అమ్మవారు. మనకున్న గృహారామక్షేత్ర ధనకనక వస్తువాహనాదులన్నీ అమ్మ స్వరూపమే. ఒక్కమాటలో చెబితే ధర్మార్థ కామమోక్షాలలో అర్థం. ఈ అర్థమే మిగతా పురుషార్ధాలు మూడూ సిద్ధించటానికి మూలం. దాన్ని సద్వినియోగం చేస్తే ధర్మకామాలూ-ఉదాసీనంగా చూస్తే మోక్షమూ-దక్కుతాయి మానవుడికి. రెండు పక్షాలలోనూ అది పరార్థమేగాని
Page 109