ఫలశ్రుతి
విష్ణు సహస్రనామ స్తోత్రం సమాప్త మయిందిక్కడికి. స్వామివారి దర్శనం కూడా మనకు లభించింది. శంఖచక్ర నందకాది దివ్యాయుధాలతో దివ్యమంగళ విగ్రహుడు సాక్షాత్కరించాడు. అయితే ఆ సాక్షాత్కరించిన స్వరూపం మన మనసులో యావజ్జీవమూ చెదరకుండా నిలిచి ఉండాలంటే ఉపశ్రుతితో పాటు ఫలశ్రుతికూడా చేయాలి మనం. ఉపశ్రుతి ఇంతకుముందు స్తోత్రారంభంలోనే చేసి ఉన్నాము. పోతే ప్రస్తుతం స్తోత్రాంతంలో ఫలశ్రుతి చేయవలసి ఉంది మరలా.
స్తోత్రమిది ఎవరు ఎవరివల్ల శ్రవణం చేశారసలు. ఆనుశాసనికంలో భీష్ముడి వల్ల ధర్మజుడని గదా చెప్పుకొన్నాము. భీష్ముడని పేరేగాని బోధ చేసిందసలు కృష్ణుడే. కృష్ణుడంటే కాలాని కతీతమైన పరమాత్మ తత్త్వం. అది ధర్మజుడికి బోధించిందంటే ధర్మజుడెవడు. కాల స్వరూపుడైన యముడి అంశం. కాలమంటే ఏదో గాదు. మానవుడి మనస్సుకు సంకేతం. అప్పటికి మనస్సు కతీతమైన భూమికలో మసలుతున్న ఒకానొక జీవన్ముక్తుడైన సద్గురువు మనో భూమికలో కొట్టుమిట్టాడుతున్న తత్త్వ జిజ్ఞాసువైన ఒక సచ్ఛిష్యుడికి గావించే ఒక మహోపదేశంగా భావించాలి ఈ స్తోత్రాన్ని మనం. ధర్మజ భీష్మ సంవాదమనేది ఒక ఆఖ్యాయిక. ఆఖ్యాయికలన్నీ సత్యానికి కేవలం సంకేతాలు మాత్రమే. భగవత్తత్త్వ విజ్ఞానమే ఇక్కడ సత్యం.
తద్విషయంలో అయిదు ప్రశ్నలు వేశాడు ధర్మరాజు పితామహుణ్ణి. ఏది గొప్ప దైవతం - ఏది పరాయణం - పరమమైన ధర్మమేది. దేనినర్చన చేయాలి మానవుడు. ఏది జపించి ఈ సంసార బంధం నుంచి బయటపడాలని ఇలా అయిదు విధాల ప్రశ్నిస్తాడు. అయితే అయిదుగా కనిపిస్తున్నా అయిదూ కలసి ఒకే ప్రశ్న వాస్తవానికి, వాటికి సమాధానాలు కూడా భీష్ముడయిదు చెప్పినట్టు పైకి కనిపిస్తున్నదే గాని వాస్తవంలో సమాధానం కూడా ఒక్కటే. అవి ఏవో గావు.
Page 67