జీవిత పరమార్థమేమిటని ప్రశ్న. అది సర్వవ్యాపకమైన విష్ణుతత్త్వమే నని జవాబు. దైవతమన్నా అదే. పరాయణమన్నా అదే. పరమధర్మమన్నా అదే. అర్చించవలసింది జపించవలసిందీ కూడా అదే. విష్ణుతత్త్వమే.
కాగా ఆ విష్ణు తత్త్వమేమిటో దానినెలా అందుకోవాలో తరువాత సహస్ర ముఖాలతో వర్ణించింది సహస్రనామం. నామమనేది రూపాన్నే గదా వర్ణిస్తుందెప్పుడైనా సహస్రనామాలూ చేస్తూ వచ్చిందదే. అయితే అన్ని నామాలూ చెబుతున్న రూపాలన్ని లేవు వాస్తవంలో. ఉన్నదొకే ఒక రూపం. అది పరమాత్మ రూపం. రూపంగా గాని రూపమది. పోతే దాన్ని పేర్కొనే నామం కూడా నామం కాని నామమే. నామరూపాలు రెండూ చివరకు నామ రూప రహితమైన తత్త్వంలో లయమయ్యేవే. అలా లయం చేసుకొని ఏకైకమైన ఆ తత్త్వాన్ని సాధకు డాత్మరూపంగా దర్శించాలని చాటటమే ఈ సహస్ర నామాలూ చేస్తున్న ఏకైకమైన ఉపదేశం. శాస్త్రమెప్పుడూ అనేకత్వాన్ని వర్ణించిందంటే అది ఏకత్వంలో మన బుద్ధిని పర్యవసితం చేయటానికే. శతమూర్తి, రమూర్తి మాన్ ఏకో-నైకః తత్త్వవిత్-ఏకాత్మా అని అక్కడక్కడా దొరలిన నామాలీ పరమార్థాన్నే మనకు రహస్యంగా సూచిస్తున్నాయి.
మానవుడీ అనేకాత్మకమైన జగత్తులో పరిభ్రమిస్తూ దానికి మూలమైన ఆ ఏకత్వాన్ని ఎప్పుడో మరచిపోయాడు. కనుకనే సర్వమూ విష్ణుమయమే అయినా వాడికా విష్ణువే విశ్వమయంగా భాసిస్తున్నది. దాని ఫలితమే ఈ సంసారబంధం. దీనికి పరిష్కారమే కోరితే ద్యౌస్సచంద్రార్క నక్షత్రా-ససురాసుర గంధర్వమ్ ఈ చరాచర జగత్తంతా విష్ణు బలంచేతనే విధృతం - విష్ణువశంలోనే వర్తితం విష్ణ్వాత్మకమేనని దర్శించాలి. అంతేకాదు. ఇంద్రియాణి మనోబుద్ధిః వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం | క్షేత్రజ్ఞ ఏవచ | మనః ప్రాణేంద్రియాదికమైన ఈ సంఘాతం కూడా వాసు దేవస్వరూపమేనని భావించాలి. ఏకోవిష్ణు ర్మహద్భూతమ్ ఒకే ఒక విష్ణు తత్త్వం. అదే ఈ సమస్త ప్రకృతీ-అంతః ప్రకృతీ అదే బహిఃప్రకృతీ అదే. అణువు మొదలు ఆకాశందాకా దానికి విజాతీయమైన భావమేదీ లేదు.
Page 68