ఏది చూచినా వసతి-దీవ్యతి-కేవలమున్నది-ప్రకాశిస్తున్నది. అంత మాత్రమే. అని సచ్చిద్రూపమైన విష్ణు తత్త్వంతోనే ముడిపెట్టి చూడాలీ విశ్వాన్ని. అప్పుడు విష్ణువు విశ్వంగా ఎలా కనిపిస్తాడో అలాగే విశ్వం కూడా విష్ణువుగా భాసిస్తుంది. మొదటిది ఏకమనేకమైతే రెండవది అనేక మేకమయ్యే ప్రక్రియ.
అయితే ఒక్కమాట, ఏకమైన తత్త్వం మొదట గుర్తించగలగాలి ఈ అనేకత్వంలో. అలా గుర్తిస్తేనే అనేకత్వాన్ని చూచినా భయంలేదు. ఏకంగానే కనిపిస్తుంది. లేకుంటే విష్ణువు దూరమయిపోయి విశ్వం మాత్రమే ప్రత్యక్షమయి మన ప్రాణం తీస్తుంటుంది. కాబట్టి మానవుడీ లౌకిక జీవితానికి స్వస్తి చెప్పి సాధకుడై కాయేన వాచా మనసా - త్రికరణాలతో చేసే ప్రతిపనీ ఆ మహావిష్ణువుకే సమర్పణ చేస్తూ పోవాలి. అంటే వ్యష్టిని సమష్టిగా భావన చేయాలని అర్థం. అదే పరిపూర్ణ శరణాగతి. దానికి ఫలం ఇహంలో భోగం పరంలో మోక్షం ఆ మహావిష్ణువే మనకు ప్రసాదిస్తాడు. విష్ణువంటే త్రిమూర్తులలో విష్ణువని భ్రమపడరాదు మరలా. త్రిమూర్తులూ ముగ్గురూ కలిసి సగుణమైన భగవత్తత్త్వమే. అందులో తేడాలేదు. బ్రహ్మ అయినా, విష్ణువయినా, రుద్రు డయినా ఒక్కటే. పోతే వీటికి మూలమైన నిర్గుణ స్వరూపమేది ఉందో అదే ఇక్కడ విష్ణువనే మాట కర్థం. పదార్థాన్ని బట్టి చూచినా సర్వ వ్యాపకమైన చైతన్యమే విష్ణువు. అదే సగుణరూపంగా భోగమూ, నిర్గుణమైన ఆత్మస్వరూపంగా మోక్షమూ, సాధకుడికి ప్రసాదిస్తుందని తాత్పర్యం.
విష్ణు నామ సహస్రస్య - రహస్యమ్ యత్ప్రపంచితమ్ |
సభాముఖే పురా - తస్య - సారోయమ్ గ్రథితో మయా ॥
శ్రూయతామ్ చింత్యతామ్ సర్వై - ర్ధ్యాయతా మనుభూయతామ్ |
మహావిష్ణు ప్రసాదేన - జన్మ సాఫల్య మాప్యతామ్ ||
Page 69