ఉత్తరార్ధమ్
106
అనన్యా శ్చింతయంతోమా- యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం 9-22
అందుకే జీవితాంతమూ అనన్యమైన చింతనతో ఉండాలి మానవుడు. అన్యం లేనిదేదో అది అనన్యం. అది సర్వతో వ్యాప్తమైన ఆత్మతత్త్వ మొక్కటే. అది మన స్వరూపమే. ఇలాంటి స్వరూపమే ఎక్కడ బట్టినా. అదితప్ప మరేదీ లేదు. అంటే ఏమన్నమాట. నీవు నిత్యమూ కండ్లు పెట్టుకొని ఏది చూస్తున్నావో - చెవులతో ఏది వింటున్నావో-చేతులతో ఏది స్పృశిస్తున్నావో -ందంతా ఆత్మే.. ఏ ఇంద్రియానికే విషయం గోచర మవుతున్నా దానినంతా ఆత్మ చైతన్యంగానే భావిస్తు పోవాలి. అంతేగాని ఇది శబ్దమని- ఇది స్వర్శమని- ఇది రూపమని- స్వరూపానికి భిన్నగా చూడగూడదు.
ఇలాంటి ఆత్మైక భావనకే అనన్య భక్తి అని పేరు. అసన్యభక్తి అన్నా - పరా భక్తి అన్నా- ఒక్కటే. ఇది మామూలుగా మనమనుకొనే భక్తికాదు. మామూలు భక్తిలో సేవ్య సేవక భావముంటుంది. ఉపాస్య ఉపాసక భావముంటుంది. ఇందులో అలాంటి విభాగముండదు. అనన్యమిది. ఇది జ్ఞానాని కనంతర భూమిక. సామాన్యమైన భక్తిజ్ఞానానికి పూర్వభూమిక. జ్ఞానమంటే పరమార్థాన్ని గూర్చి చేసే విచారణ. అది భక్తిశ్రద్ధలుంటేగాని ఏర్పడదు. ఏర్పడిన తరువాత ఆజ్ఞాన మపరోక్షమైన అనుభూతినివ్వాలి. ఇది ఆ కలిగిన జ్ఞానంలో నిష్ట ఏర్ప డితే గాని రాదు. ఇదుగో ఈ జ్ఞానినిష్టనే అనన్యభక్తి అని -పరాభక్తి అని-వ్యవ హరిస్తారు. ఇది కేవల జ్ఞానంకన్నా శ్రేష్టమైనది. ఆత్మ చైతన్యం తప్ప మరిదేనికీ ప్రవేశం లేదీభూమికలో. అంతా ఆత్మే. చూచేదీ చూడబడేదీ-చూపూ అంతా అదే. అంతా నేనే. “పర్యుపాసతే" అన్నమాటకిదే అర్థం. పరితః- ఉప-అసనా- అంటే అంతటా తన స్వరూపాన్నే చూస్తూ దాన్నే పట్టుగొని కూచోటం.
అయితే అలా కూచోమన్నారు బాగానే ఉంది. కూచోగలమా అనే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే దీనికి రెండు ప్రతి బంధకాలు కనిపిస్తున్నాయి. మనం చేయ వలసిన సాధన ఎప్పుడూ మనసుతోనే గాని మరిదేనితోనూ గాదు. ఈ మనసుకు ఒక రోగమున్నది. అది ఏదో ఒక ఆకారాన్నే చూడాలి. ఆ ఆకారం కూడా ఎప్పటికప్పుడు మారుతుండాలి. అలాంటప్పుడోకే ఒక నిరాకారమైన తత్త్వాన్ని ఏకధారగా చూడటమంటే అది ఎలా సంభవం. అలాగే ఒకవేళ చచ్చి సున్నమై అదేలోకంగా కూచున్నామే అనుకోండి. లోకంలో మన దైనందిన వ్యవహారం జరిగేది ఎలాగా. దానికి మనమిక స్వస్తి చెప్పక తప్పదు గదా. చెబితే మనకొక శరీరమంటూ ఉందిగదా. ఆకలిదప్పులున్నాయి గదా. వాటి సంగతేమిటి- ఎవరు చూస్తారు. కనుక అది అసంభవమే.
వీటిరెండింటికీ సమాధానమే ఉత్తరార్థం. అలా ప్రతిక్షణం ఆత్మ చింతనతో కాలంగడిపే సాధకుడికి పనులు ఎలా జరుగుతాయని గదా ప్రశ్న. అవి జరప టానికి ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వర ప్రకృతేగదా ఇదంతా. ఇందులోనేగదా మనకేదైనా ఒకకార్యం జరగవలసింది. దాని కధ్యక్షుడైన ఈశ్వరుడే ప్రేరణ కలిగిస్తాడు. అది మన ప్రారబ్దాన్ని బట్టి ఎక్కడో లోకంలో ఎవరికో బుద్ధి పుట్టించి ఏదో ఒక ఉపకారం మనకు చేయిస్తుంది. ప్రారబ్ధాన్ని బట్టే ఏదైనా మనకు జరుగుతుంది ఇక మనకు భయమేముంది. ఊరకున్నా జరుగుతుంది. లేక పోయినా జరుగుతుంది. మన దగ్గరికి దానిపాటికది దొర్లుకొంలూ వస్తుంది. ఇదే యోగం. పోతే ఆ వచ్చింది మన ప్రారబ్దాన్ని బట్టి ఎక్కడికి పోదు. ఎంత కాల ముండాలో అంత కాలమూ ఉండి తీరుతుంది. ఇదే క్షేమం.
ఇది లోక విషయంగా చెప్పినమాట. పోతే మన సాధన విషయంలో కూడా ఇంతే. అయితే ఒక విశేష మేమంటే లౌకికంలో కేవల ప్రారబ్దం వల్లనే పనులు జరుగుతాయి. దానినే ఈశ్వర ప్రేరణగా చెప్పుకొన్నాము. పోతే ఇక్కడ సాధన విషయంలో అలాకాదు. ఈశ్వరుడే స్వయంగా అనుగ్రహిస్తాడిక్కడ. సాధన అంతకంతకూ ప్రబలమై ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి ఫలించేలాగా చూస్తాడు. మనస్సు కున్న దౌర్బల్యం మాటేమిటిని అడగవచ్చు. దౌర్బల్యం దానికి సహజంకాదు రజస్తమోగుణ సంపర్కంవల్ల ఏర్పడింది. అది నిరంతర బ్రహ్మ చింతనలో ఉన్న సాధకుడికి ఈశ్వరానుగ్రహం వల్ల తొలగిపోతుంది. మరలా ఈ ఈశ్వరుడు ఎక్కడినుంచి వచ్చాడని ప్రశ్నించ రాదు. తాను ఈశ్వరుడయ్యే వరకూ ఈశ్వరుడొక డుండనే ఉంటాడు. లేదా తానే ఈశ్వరుడనే ఏ భావన ఉందో అదే ఈశ్వరుడనుకొవచ్చు. ఆ భావనే మనలను అనుగ్రహిస్తుందని చెప్పినా చెప్పవచ్చుగదా.
మొత్తంమీద అనన్యభక్తి యోగానుష్ఠానం సాధ్యమే. అసాధ్య మనుకొనే రెండు ప్రతిబంధకాలూ చిత్తశుద్ధితో ముందుకుపోయే సాధకుణ్ణి ఎన్నడూ బాధిం చవు. ఎంచేతనంటే వాడు లౌకిక వ్యవహారాలన్నీ ప్రారబ్ధానికి ఒప్ప చెబుతాడు. పార లౌకికంగా జరిగే సాధన అంతా తన ఈశ్వర భావనకే అప్పగిస్తాడు. అందులో కూడా అప్పుడప్పు డంతరాయాలు కలుగుతుంటే అవి తన ప్రబల మైన ప్రారబ్ధదోషం వల్లనైనా కావచ్చు. లేక తన ఆత్మభావన అంత ప్రబలంగా లేనందువల్లనైనా కావచ్చునని సమాధాన పడతాడు. అలా పడగలిగితే చాలు. ఆప్రారబ్దం కూడా అతి చిత్రంగా తొలగిపోయి ఈశ్వరానుగ్రహానికే పాత్రు డౌతాడు సాధకుడు. ఇదీ దీనిలో ఇమిడి భాన్న సాధన రహస్యం.