మరి అంతా భావనే గాని వాస్తవం కానప్పుడెందు కిదంతా ఇంత దూరం వర్ణించటమని అడుగుతారేమో. అలా వర్ణిస్తే గాని ఈ సృష్టి అంతా ఏదోగాదా సృష్టి కర్త స్వరూపమేనని దీన్ని దానితో ముడిపెట్టి తద్రూపంగానే సమస్త ప్రపంచాన్నీ దర్శించే అద్వైత దృష్టి అలవడదు. అసతోమా సద్గమయ అన్నట్టు అసత్యం ద్వారానే సత్యమైన తత్త్వాన్ని అందుకోవలసి ఉంటుంది. అందుకొంటే అప్పుడీ అసత్తు అసత్తుగా కనిపించదు. ఇది కూడా సత్తుగానే అనుభవానికి వస్తుంది. అలాటి అఖండమైన అద్వైతానుభవాన్ని మానవుడి కందివ్వటమే సృష్టిని వర్ణించటంలో ఉన్న ఏకైక ప్రయోజనం. కాబట్టి సృష్టి జరిగిందని చిలవలు పలువలు పెట్టి వర్ణించారంటే ఇదే పరమార్ధమని పట్టుకోరాదు మనం. పరమార్ధాన్ని పట్టుకోటానికిది ఒక ఉపాయమనీ సంకేతమనీ మాత్రమే భావించాలి ఇదే అర్ధవాదమని మేము పేర్కొనటం. ఈ అర్థవాదాన్నే సాగదీసి వర్ణిస్తున్నది మంత్రం వినండి.
తస్మా ద్యజ్జా త్సర్వహుతః - సంభృతగం పృషదాజ్యం పశూంస్తాం శ్చక్రే వాయవ్యా - నారణ్యా గ్రామాశ్చయే -
ఆ హిరణ్యగర్భుడి రూపంగా అవతరించినది పరమాత్మేనని గదా చెప్పాము. అతడే ప్రజాపతి. తరువాత సృష్టికి కారకుడు. స వై శరీరీ ప్రధమ స్స వైపురుష ఉచ్యతే. ఆయనే మొట్ట మొదట శరీరం ధరించి బయటపడ్డవాడు.
Page 80