ఏతా వాతా మరొక రహస్యం కూడా బయట పడుతున్నదీ మంత్రంలో. తన పాటికి తాను చైతన్యమేదీ సృష్టించటం లేదు. అజాత వాద మద్వైతులది. ఏదీ దేనిలో నుంచీ జన్మించదు. అంతకు ముందున్నదీ జన్మించదు. లేనిదీ జన్మించదు. అయినా ఏదో జన్మించినట్టు చేసినట్టు భాసిస్తున్నదంటే అది భాసే గాని వాస్తవం కాదు. అదైనా ఎలా జరిగిందంటే రజ్జు సర్ప దృష్టాంతాన్ని విచారిస్తే తెలిసిపోతుంది. రజ్జువుకు సర్పంగా మారే శక్తి ఉంది. కాని తన పాటికి తానెప్పుడూ మారి కనిపించదు. అలాగైతే ప్రపంచమంతా సర్పమయమయి పోయేది. అలాగే మానవుడు భ్రాంతి పడి రజ్జువునే సర్పమని చూడకున్నా కనిపించదా సర్పం. పోతే మానవుడి దృష్టి రజ్జు స్వభావమూ రెండూ తోడయినప్పుడే సర్ప సృష్టి జరుగుతుంది. ఇందులో ఏది కొరవడ్డా లేదు. రజ్జువు రజ్జువుగానే ఉండి పోతుంది.
అలాగే ప్రస్తుతం పరమాత్మ ప్రపంచంగా మారాలంటే సృష్టించే శక్తి ఆయనలో అవ్యక్తంగా ఉండాలి. అలాగే అవ్యక్తమైన దాన్ని వ్యక్తం చేసుకొని చూచే లక్షణ మీ జ్ఞానమూ ప్రాణమూ ఉన్న మనబోటి జీవులకూ కూడా ఉండాలి. అప్పటికీ జీవులే తమ జ్ఞానంతో అవ్యక్తమైన ఆతత్త్వాన్నే ఆయా రూపాలుగా వ్యక్తమయినట్టు భావిస్తూ పోతే వీరి వీరి దృష్టి కనుగుణంగా అది అనేక రూపాలుగా సృష్టి అయి కనిపిస్తున్నదని అర్థం.
Page 79