ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన మహర్షులు. వారీ సృష్టినంతా పరమాత్మ స్వరూపంగానే దర్శిస్తుంటారు. అలాటి అద్వైత దర్శనమే జిజ్ఞాసు లోకాని కందివ్వాలని వారు కల్పించిన ఒక అర్థవాద Anecdote మిది. దాని కనుగుణంగా ఒక యజ్ఞంతో పోల్చి వర్ణిస్తున్నారీ సృష్టిని. ఆ మూల తత్త్వమే ఉపాదానం దీనికి. అదే నామరూపాత్మకమైన భౌతిక ప్రపంచంగా కనిపిస్తున్నదంత కన్నా ఏమీ లేదని అలా వేరుగాదని చెప్పటమే - పురుషుడే ఇందులో హవిస్సయ్యాడని భంగ్యం తరంగా చెప్పటం మనకు.
మరి యజ్ఞానుష్ఠానానికి ఋతు నియమముంది గదా. ఎప్పుడంటే అప్పుడు చేయరు గదా యజ్ఞం. మరి ఆ ఋతువు లేమిటిక్కడ అని అడిగితే బయటపెడుతున్నది మంత్రం. వసంతో అస్యాసీ దాజ్యం. వసంత ఋతువీ యజ్ఞ కుండంలో పోసే ఆజ్యమే. అలాగే గ్రీష్మ ఋతు విధ్మం. సమిధలు. పోతే శరదృతువు హవిస్సే. హవిస్సంటే ఇక్కడ మిగతా యజ్ఞ ద్రవ్యాలు. అంటే అర్ధం త్రిగుణాత్మకమైన ప్రకృతే ఆహుతి అవుతున్నదీ యజ్ఞంలో. పురుషుడూ ప్రకృతీ ఒకటే గదా. పురుషుడు నిమిత్తం ప్రకృతి ఉపాదాన మని ఎప్పుడన్నామో రెండూ ఒకటి కావలసిందే తప్పదు. కనుక పురుషుడాహుతి అయ్యాడంటే ఆయన శక్తి కూడా ఆయనతో పాటు ఆహుతి కావలసిందే. శక్తి అంటే ప్రకృతికి మారు పేరు. ఆయన స్వభావమది Nature. అదే త్రిగుణాత్మకమని గదా పేర్కొన్నాము.
Page 75