అవి ఈ సృష్టితో ఖర్చయి పోలేదు. అలా ఖర్చయి పోతే అది మృతం. మృతమంటే ఎప్పటికప్పుడు మారిపోయేది. మారుతూ మారుతూ చివరకు మాసిపోయేది. ప్రాపంచికమైన పదార్థాలన్నీ అలాంటివే. ఇది మన కనుభవ సిద్ధమే. మనమూ పోతున్నాము. మనం చూచేదీ పోతున్నది. కారణం రెండూ విశేష రూపాలే. ఈ దృక్కూ విశేషమే. ఇది చూచే ఆ దృశ్యమూ విశేషమే. విశేషాని కెప్పుడూ నిలకడ లేదు. క్షణ క్షణ పరిణామ శీలం.
పోతే ఆ పురుష స్వరూపమీ జీవ జగద్రూపంగా ఒక వంతు మారుతున్నా మిగతా మూడు వంతులు మారకుండా అలాగే నిలిచి ఉన్నది. త్రిపాదస్య అమృతం దివి. ఎక్కడ ఎలాగా. దివి. తన చైతన్య ప్రకాశంలో. ఎలాగ. అమృతం- ఏలాటి మార్పూ లేకుండా. మృత మంటే మారట మన్నప్పు డమృతమంటే మార్పు లేదనే గదా అర్ధం. ఏమిటా మూడు వంతులు. తేజో బన్నాలే ఆ మూడూ. తేజస్సు అప్పు అన్నం. అప్పంటే జలం. అన్నమంటే పృథివి. అప్పటికి పృథి వ్యక్తేజస్సులే ఆ మూడు పాదాలూ. ఇవి మూడూ అమృతం మారవంటున్నాడు. ఇది ఎలా సాధ్యం. పృధి వ్యాదులు మారుతున్నట్టే గదా మనకు కనిపిస్తున్నాయి. మనకు కనిపిస్తున్నాయంటే అవి భూతాలు. అవి మారుతూనే ఉంటాయి. పురుష సూక్తం చెబుతున్నవి భూతాలు కావు. వాటికి మూలమైన భూత తన్మాత్రలు.
Page 67