కర్దమేన ప్రజా భూతా-
మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మేకులే -
మాతరం పద్మమాలినీమ్
అసలా శ్రీ ఎవరో కాదు. కర్దముడని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన కన్న బిడ్డ అని పేర్కొంటాయి పురాణాలు. మహాలక్ష్మి కర్దమ ప్రజాపతి కూతురా. ఏమిటర్ధం. ప్రజాపతులందరూ ప్రజా సృష్టికి కర్తలు. అందుకే వారికి ప్రజాపతులని పేరు వచ్చింది. ప్రజా సృష్టి చేయాలంటే వారికి తపశ్శక్తి ఉండాలి. దానివల్ల ఏర్పడిందే ఈ ప్రపంచ స్థితి. ఇదే లక్ష్మి. కనుక ప్రజాపతి సంతాన మయింది లక్ష్మి. ఇది బాహ్యార్ధమైతే అంతరార్థం వేరే ఉన్నది.
కర్దమమంటే బురద. అదే ఈ సంసారం. సంసార పంక నిర్మగ్న అని లలితా నామం. కర్దమేన ప్రజాభూతా ప్రజాయంతే ఇతి ప్రజాః చరాచర పదార్ధాలన్నీ ఈ సంసార మనే కర్దమం నుంచే జన్మించాయి. పృథివీ తత్త్వం నుంచే గదా సర్వమూ ఏర్పడింది. అలా జన్మించటం వరకే అయితే అది గొప్ప గాదు. దానినుంచి బయటపడా లెప్పటికైనా. ఎలాగ. మయిసంభవ కర్దమ. అందుకే చెబుతున్నారు. నాలోనే ఈ కర్దమం చేరి పోవు గాక. సంసారం నాకు బాహ్యంగా గాక నాలో చేరి నా స్వరూపంలో ప్రవిలయ మయి పోవాలని కోరుకోవాలి మనం. అప్పుడు మన ఆత్మ విశ్వాత్మగా పరిణమిస్తుంది. ఇక మనకన్యంగా ఒక సంసారమనీ తన్నిమిత్తంగా కష్టసుఖాలనీ ఉండబోవు.
Page 36